పాకిస్తాన్పై మోడీ ప్రభుత్వం మరో 'ఆర్థిక' దెబ్బ, ఏకాకి చేసేందుకు పలు దేశాలతో చర్చ
శ్రీనగర్/కరాచీ/ఢిల్లీ: పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత ప్రాధాన్య దేశం) అన్న హోదాను తొలగించిన కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాలను 200 శాతం మేర పెంచింది. ఆ తర్వాత కొన్ని వస్తువుల దిగుమతులను నిషేధించే అవకాశాలు ఉన్నాయి. కస్టమ్స్ సుంకాల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని అరుణ్ జైట్లీ ఈ మేరకు పేర్కొన్నారు.
పాకిస్తాన్కు ఆర్థికంగా దెబ్బ
ఈ సుంకాలు పెంచితే పాకిస్తాన్ నుంచి దిగుమతులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్కు భారత్ 1996లో ఎంఎన్ఎఫ్ హోదా ఇచ్చింది. కానీ అప్పుడు పాకిస్తాన్ మత్రం ప్రత్యుపకారంగా మనకూ ఏ హోదా ఇవ్వలేదు. ఆ హోదాను ఇప్పుడు భారత్ తొలగించడంతో పాటు సుంకాన్ని 200 శాతానికి పెంచింది. తాజా నిర్ణయాలతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు మరింత కష్టాలు తెచ్చిపెట్టనుంది. సుంకం పెంపు కారణంగా ధరలు పెరిగితే దిగుమతులు భారీగా తగ్గుతాయి.ఇప్పటి వరకు వీటిపై సుంకం 30 నుంచి 50 శాతం ఉంది. పాక్ నుంచి భారత్కు ప్రధానంగా పండ్లు, సిమెంట్ దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య ఆంక్షలతో పాకిస్తాన్ను కట్టడి చేసే ఆలోచనలో భారత్ ఉంది.
పలు దేశాల రాయబారులతో చర్చలు
ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్తాన్ను ఒంటరిని చేయాలనే లక్ష్యంలో భాగంగా శనివారం నాడు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోయల్ పలు దేశాల రాజయబారులతో చర్చలు జరిపారు. ఆసియా, ఆఫ్రికా దేశాల దౌత్యాధికారులతో భేటీ అయి పుల్వామా దుర్ఘటన వివరాలను తెలిపారు. ఆసియాన్, గల్ఫ్ సహకార మండలి రాయబారులను కలిశారు. శుక్రవారం 25మంది రాయబారులతో సంప్రదింపులు జరిపి పరిస్థితిని తెలిపారు.
మళ్లీ అదే మాట
ఆధారాలు ఇస్తే దర్యాఫ్తు జరిపిస్తామని పాకిస్తాన్ పాతపాటే పాడింది. మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి వెనుకాడుతోంది. గతంలో జరిగిన ఉగ్రదాడులపై ఆధారాలు ఇచ్చినా.. అవి సరిపోవని చెబుతోంది. ఇప్పుడు తాజాగా, పుల్వామా ఘటనపై కూడా ఆధారాలు ఇవ్వాలని, దర్యాఫ్తుకు సహకరిస్తామని తెలిపింది. కానీ ఆధారాలు ఇచ్చినా ఆ దిశగా మాత్రం పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం లేదు. పుల్వామా దుర్ఘటనపై భారత్ తగిన ఆధారాలు ఇస్తే దర్యాప్తునకు సహకరిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ కురేషి అన్నారు. ఈ సంఘటనను అడ్డం పెట్టుకొని ఎవరూ తమ దేశాన్ని బెదిరించలేరన్నారు. ఎటువంటి దర్యాప్తు జరపకుండానే భారత్ తమపై ఆరోపణలు చేస్తోందని, దీనిని ప్రపంచం అంగీకరించబోదన్నారు.