పెట్టుబడులకు భారత్ స్వర్గధామం: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
నౌకాయాన రంగం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు, పర్యాటకం, మానవవనరులు, సాంకేతికత, రక్షణ రంగాల్లో స్టార్ట్ అప్ కంపెనీలను భారత్లో ప్రారంభించాలని గ్రీస్ ప్రభుత్వానికి పిలుపు నిచ్చారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరిగిన ఇండియా గ్రీక్ బిజినెస్ ఫోరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నౌకాయాన రంగంలో భారత్లో పుష్కల అవకాశాలున్నాయని చెప్పిన ఆయన...సాగరమాల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
డిఫెన్స్ ఉత్పత్తుల రంగం, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎంటర్టెయిన్మెంట్, సాంకేతిక రంగాల్లో కూడా మంచి అవకాశాలున్నాయని చెప్పారు. సౌరశక్తి రంగంలో ఇరుదేశాలు ముందంజలో ఉన్నాయని కోవింద్ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య 530 మిలియన్ అమెరికా డాలర్ల మేరా వ్యాపారం జరుగుతోందని స్పష్టం చేశారు. మరింతగా కృషి చేస్తే భవిష్యత్తులో ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల మార్క్ను తాకుతుందని కోవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య ఎన్నో పోలికలున్నాయని చెప్పిన కోవింద్... భారత్ గ్రీకు దేశాలు ప్రాచీన నాగరికతలు కలిగి ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సంస్కృతి ఈ నాటిది కాదని.. అది 2,500 ఏళ్ల నాటిదని గుర్తు చేశారు.
భారత్ ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.మేకిన్ ఇండియా, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, స్కిల్ ఇండియాలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భారత్ చేపడుతోందని... జీఎస్టీ అమలుతో కొత్త చరిత్ర సృష్టించిందని రామ్నాథ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రీకు అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్లోపోలస్, ప్రధాని అలెక్సిస్ సిప్రస్ పాల్గొన్నారు.