నిప్పుతో చెలగాటమాడొద్దు: భారత్కు చైనా హెచ్చరిక, ఎందుకంటే..?
దక్షిణ చైనా సముద్రం, దలైలామా, తైవాన్తో తమకున్న సమస్యలను భారత్.. తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని, ఇది నిప్పుతో చెలగాటమేనని చైనా హెచ్చరించింది.
న్యూఢిల్లీ/బీజింగ్: మనదేశంపై చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. దక్షిణ చైనా సముద్రం, దలైలామా, తైవాన్తో తమకున్న సమస్యలను భారత్.. తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని, ఇది నిప్పుతో చెలగాటమేనని చైనా హెచ్చరించింది. తైవాన్ పార్లమెంటరీ ప్రతినిధులతో భారత్ సమావేశం కావడాన్ని విమర్శిస్తూ.. భారత్ రెచ్చగొట్టే పనులు చేస్తోందని మండిపడింది.
అంతేగాక, తైవాన్, చైనాల సమస్యను వాడుకుని లబ్ది పొందాలని చూస్తే, తీవ్రంగా నష్టపోవడం ఖాయమని చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్', మరో దినపత్రిక 'పీపుల్స్ డైలీ'లు హెచ్చరించాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు సైతం చైనా వ్యతిరేక విధానాన్ని వదిలేశారని, ఇండియా మాత్రం ఆ పని చేయడం లేదని ఆరోపించింది.
కాగా, 2016లో తైవాన్లో త్సాయ్ ఇంగ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఇండియాతో మరింత బలమైన బంధం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తైవాన్లో భారత ఎంబసీ లేకపోవడంతో ఇండియా - తైపీ అసోసియేషన్ మధ్యవర్తిగా రాజకీయ, వ్యాపార బంధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇక 'వన్ చైనా పాలసీ' కారణంగా తైవాన్తో సత్సంబంధాలను నెరపని చైనా.. ఇండియా ఆ దేశానికి దగ్గరవుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇక తాము భారతదేశానికి దగ్గరగా ఉండాలంటే.. వన్ చైనా పాలసీపై నిబద్ధతను చూపాలని ప్రధాని నరేంద్ర మోడీకి తమ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని ఆ పత్రికలు పేర్కొన్నాయి. ఇండియాలో తైవాన్ ఇన్వెస్ట్ మెంట్స్ పెరిగితే, అతి తమ ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించవచ్చని హెచ్చరికలు చేయడం గమనార్హం. అంతేగాక, ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది.