అమెరికా బాటలోనే మిత్రులు... చైనాపై పోరులో భారత్ కు బాసట.. తాజాగా ఇజ్రాయెల్..
చైనాతో సరిహద్దు వివాదాల తర్వాత వేగంగా అడుగులు వేస్తున్న భారత్.. అమెరికా సాయంతో సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఫ్రాన్స్ తోనూ సహకారం లభిస్తుండటంతో అతి త్వరలోనే సైనిక సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో పాత మిత్రుడు రష్యా కూడా భారత్ కు సహకరించేందుకు సిద్ధమేనన్న సంకేతాలు ఇస్తోంది. దీంతో భారత్ కూడా ఆచితూచి అడుగులేయాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ రక్షణమంత్రితో మన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు.
చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
చైనాపై పోరుకు ఆయుధాలు...
చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆయుధాలతో పాటు సరికొత్త ఆయుధాలు, రక్షణ వ్యవస్ధల అవసరం ఏర్పడింది. వీటిలో ఫైటర్ జెట్లతో పాటు ఆకాశం నుంచి భూమి మీదకు ప్రయోగించే స్మార్ట్ ఆయధాలు, మిసైల్స్, రాకెట్లు, మల్టీ మిషన్ డ్రోన్లు, వాయురక్షణ వ్యవస్ధలు, జీపీఎస్ ఆథారిత మందుగుండు సామాగ్రి, యుద్ధ ట్యాంకులు, రైఫిల్స్ అవసరం పెరిగింది. వీటిని కుప్పలుతెప్పలుగా సంపాదించుకున్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి వీటిని అత్యవసరంగా దిగుమతి చేసుకునేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్ ప్రయత్నాలకు ఆయా దేశాల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
భారత్ కు ఇజ్రాయెల్ సహకారం.
భారత్ కు పాత మిత్రుడు, అమెరికాకు శాశ్వత మిత్రుడు కూడా అయిన ఇజ్రాయెల్ సహకారం మనకు తప్పనిసరి కానుంది. పశ్చిమాసియాలో సమీకరణాల నేపథ్యంలో అమెరికా స్నేహంతో భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని, అత్యాధునిక సైనిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దాన్ని భారత్ తో పంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా ఇజ్రాయెల్ రక్షణమంత్రి లెఫ్టినెంట్ కల్నల్ బెంజమిన్ గాంట్జ్ తో జరిపిన ఫోన్ సంభాషణలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. చైనాతో సరిహద్దు తగాదాల నేపథ్యంలో నెలకొన్న పరిస్ధితులను రాజ్ నాథ్ బెంజమిన్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా అత్యవసరంగా అత్యాధునిక ఆయుధాలు కావాలని కోరినట్లు సమాచారం.
Recommended Video
అమెరికా బాటలోనే మిత్రులు...
గల్వాన్ ఘటన తర్వాత చైనాకు వ్యతిరేకంగా భారత్ కు మద్దతు పలుకుతున్న అమెరికా ఇప్పటికే మనకు కావాల్సిన ఆయుధ సంపత్తిని అందించేందుకు సై అంది. ఇదే కోవలో అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఫ్రాన్స్ కూడా భారత్ కు అవసరమైన ఆయుధాలను అత్యావసరంగా అందించేందుకు సిద్దమవుతున్నాయి. ఇజ్రాయెల్ తో తాజాగా రాజ్ నాథ్ సింగ్ జరిపిన చర్చల్లో సానుకూల స్పందన వ్యక్తమైందని, ఇరుదేశాల మధ్య మిలిటరీ సహకారం మరింత పెంచుకునే దిశగా ముందడుగు పడిందని రక్షణశాఖ వర్గాలు ప్రకటించాయి. ఇక మిగిలింది ఫ్రాన్స్, రష్యా. ఈ రెండు దేశాలతోనూ త్వరలో కేంద్రం చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. వీరి నుంచి కూడా అత్యాధునిక ఆయుధ సంపత్తి హామీ లభిస్తే ఇక భారత్ చైనాను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.