300 మంది హతం: బాలాకోట్లో ఉగ్రవాద శిబిరంపై దాడి నిజమే..పాక్ దౌత్యవేత్త
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే దాడి జరగలేదని.. ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని నంగనాచీ పాకిస్తాన్ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అంతర్జాతీయ మీడియాను కూడా బోల్తా కొట్టించింది. అక్కడ ఉగ్రవాద శిబిరం ఉంది అని.. తీవ్రవాదులు చనిపోయారని భారత్ చెప్పింది. అయితే పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఒకరు దాడి జరిగిందని ధృవీకరించారు. 2019 ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన దాడిలో 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని వెల్లడించారు.
దాడిలో ఎవరూ చనిపోలేదని పాకిస్తాన్ ఆర్మీ పేర్కొన్నది. కానీ మాజీ దౌత్యవేత్త ఆఘా హిలాలీ మాత్రం ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీన సీఆర్పీఎప్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేశామని తెలిపింది. పుల్వామాలో దాడి జరిగిన కొద్దిరోజుల తర్వాత పాకిస్తాన్ ఖైబర్ పక్తువా ప్రావిన్స్లో గల బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసింది.
భారత్ అంతర్జాతీయ సరిహద్దు దాటి దాడి చేసిందని హిలాలీ వివరించారు. కానీ భారత్ కన్నా తమ లక్ష్యం వేరు అని తెలిపారు. ఆయన పాకిస్తాన్ న్యూస్ చానెల్తో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. పుల్వామాలో జరిగిన దాడిలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పాత్రను ఆ దేశ మంత్రి అంగీకరించిన కొద్దీ రోజులకే ఈ ప్రకటన రావడం విశేషం.