మూడోస్సారీ..రెండే అడుగులు! కోహ్లీసేన తలరాత ఎలా ఉంది?
మాంచెస్టర్: ప్రపంచకప్లో రెండో అంకం.. కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. నాలుగేళ్లకోసారి ప్రతిష్ఠాత్మక నిర్వహించే ప్రపంచకప్లో భారత క్రికెట్ జట్టు తలరాత ఏమిటనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ముచ్చటగా మూడోస్సారి భారత జట్టు ప్రపంచకప్ను ముద్దాడుతుందా? లేదా?, ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ ఫలితం ఎలా ఉండబోతోంది. బలమైన భారత జట్టును ఓడించే సత్తా బ్లాక్ క్యాప్స్కు ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తప్ప మరేమీ వినిపించట్లేదు. క్రికెట్ను ఆస్వాదించే ప్రతి అభిమానీ బుర్ర ఓ క్వశ్చన్ బ్యాంక్లా మారిన పరిస్థితి ఇది. ఇది ఎక్కడికి దారి తీస్తుందనేది తెలియాలంటే క్షణం ఒక యుగంగా భరించక తప్పని స్థితి.
ఆసీస్ తరువాత.. మనమే!
ఇప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ను అందుకుంది టీమిండియా. ఈ కప్ గెలిస్తే- మరో మైలురాయిని అందుకుంటుంది. ఆస్ట్రేలియా తప్ప- మూడు సార్లు ప్రపంచకప్ను ముద్దాడిన జట్టు మరొకటి లేదు. ప్రపంచకప్ ఆరంభంలో కరేబియన్ క్రికెటర్లు వరుసగా రెండోసార్లు ఈ ఘనతను సాధించారు. వారి హ్యాట్రిక్ ఆశలను గండి కొట్టింది కూడా మనవాళ్లే. 1983లో కపిల్ డెవిల్స్ అండర్డాగ్ అనే గుర్తింపులో ప్రపంచకప్ ప్రస్థానాన్ని ఆరంభించింది. ఈ టోర్నమెంట్ ముగిసే సరికి జగజ్జేతగా నిలిచింది. వరుసగా మూడుసార్లు కప్పు గెలిచి, హ్యాట్రిక్ కొట్టాలనే కలతో ఫైనల్ మ్యాచ్ క్రీజులో దిగిన వెస్టిండీస్ జట్టు ఆశలను నీరుగార్చింది. సగర్వంగా కప్పును అందుకుంది కపిల్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు.
రెండోసారి ప్రపంచకప్ను అందుకోవడానికి..
1983 తరువాత మరోసారి ప్రపంచకప్ను అందుకోవడానికి రెండు దశాబ్దాల కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది భారత్కు. 28 ఏళ్ల తరువాత రెండోసారి కప్ను అందుకుంది. ఆధునిక క్రికెట్లో తిరుగులేని విధంగా ఎదిగిన భారత జట్టు మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచకప్ టైటిల్ సాధించింది. 2011 ఏప్రిల్ 2వ తేదీన ముంబై వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో శ్రీలంకను ఓడించింది. 2015లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియా ఆశలకు గండికొట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత క్రికెట్ జట్టు భంగపడింది.
ఉత్కంఠతకు గురి చేస్తోన్న టీమ్..
ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ను అందుకోవడానికి టీమిండియా సమాయాత్తమైంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కాబోయే ఈ మ్యాచ్లో భారత్.. న్యూజిలాండ్ను ఢీ కొట్టబోతోంది. రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నప్పటికీ.. టీమిండియాలో ఉన్నంత దూకుడు బ్లాక్క్యాప్స్కు లేదు. ఎదురుదాడి చేయదగ్గ లక్షణాలు తక్కువే. ఒత్తిడిలో రాణించలేకపోతోంది న్యూజిలాండ్ టీమ్. ఈ బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకోనుంది కోహ్లీసేన. కివీస్పై ఎదురుదాడికి అంటూ దిగితే- ఇక ఆ జట్టు ఒత్తిడిలో పడిపోతుంది. ఇదే ప్రధాన వ్యూహంగా బరిలో దిగబోతోంది టీమిండియా.
తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం
టీమిండియా క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఏడింట్లో అద్భత విజయాలను అందుకుంది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పరాజయాన్ని చవి చూసినప్సటికీ.. ఆ తరువాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాల రుచి చూసింది. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కేప్టెన్ విరాట్ కోహ్లీ, నంబర్ ఫోర్లో స్థిరపడ్డ రిషబ్ పంత్, అనుభవజ్ఞుడైన ధోనీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇలా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, చాహల్.. ఇలా ఎలాంటి కొమ్ములు తిరిగిన బ్యాట్స్మెన్లనయినా అవలీలగా బోల్తా కొట్టించగల బౌలర్లు భారత అమ్ముల పొదిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భారత జట్టుపై విజయం సాధించడం అనేది ఏ జట్టుకైనా ఓ అద్భుతమే అవుతుంది.
వరుణుడేం చేయబోతున్నాడు..
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ వరుణదేవుడి గండం పొంచివుంది. మ్యాచ్ సందర్భంగా వర్షం కురిసే అవకాశం ఉందని అంటూ మాంచెస్టర్లోని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. పరిస్థితేమిటనేది చర్చనీయాంశమైంది. మంగళవారం నాటి ఆట రద్దయితే.. రిజర్వ్ డే ఉండనే ఉంది. అదే మ్యాచ్ను అదే స్టేడియంలో బుధవారం నిర్వహిస్తారు. అక్కడిదాకా బాగానే ఉంది. బుధవారం కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే? అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. మ్యాచ్ రద్దయితే ఏమౌతుంది? చెరో పాయింట్ ఇస్తారు. అత్యధిక పాయింట్లు, మెరుగైన రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.
వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే టీమిండియా ఫైనల్కు, కివీస్ ఇంటికి!
ఇప్పటికే 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఆటోమేటిక్గా ఫైనల్కు చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో అయిదింట్లో నెగ్గి, మూడింట్లో ఓటమి పాలయ్యారు బ్లాక్ క్యాప్స్. దీనితో వారి ఖాతాలో ప్రస్తుతం 11 పాయింట్లే ఉన్నాయి. అదే వారికి శాపంగా మారే అవకాశాలు లేకపోలేదు. వర్షం వల్ల ఒక పాయింట్ దక్కినప్పటికీ.. వాటి సంఖ్య డజనుకే చేరుకుంటుంది. వర్షం పడి- రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దయితే- మెరుగైన రన్ రేట్, పాయింట్లను కలిగి ఉండటం వల్ల టీమిండియా ఫైనల్కు చేరుకుంటుంది. న్యూజిలాండ్ క్రికెటర్లు ఇక ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.
న్యూజిలాండ్ను తక్కువగా అంచనా వేయవచ్చా?
ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్ను అద్భుతంగా ఆరంభించింది న్యూజిలాండ్ జట్టు. వరుసగా ఆరు మ్యాచ్లలో విజయం సాధించింది. ఓ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది కూడా. ఏడో మ్యాచ్లో పాకిస్తాన్ ఎదురుపడేంత వరకూ బ్లాక్ క్యాప్స్కు ఎదురనేదే లేకుండా పోయింది. పాకిస్తాన్తో ఏడో మ్యాచ్లో ఓటమి పాలైన అనంతరం- వరుసగా మూడింట్లో పరాజయాన్ని చవి చూస్తూ వచ్చింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దిగజారింది. అలాగని ఆ జట్టును ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తనదైన రోజున ఎలా చెలరేగిఆడతాడో మనకు తెలుసు. ప్రపంచకప్ టోర్నమెంట్లో నమోదైన ఏకైక డబుల్ సెంచరీని సాధించిన ఘనత గప్టిల్ది. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జిమ్మీ నీషమ్, టామ్ లాథమ్, కొలిన్ మున్రో.. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. న్యూజిలాండ్ జట్టుకు కావాల్సినది ఒకే ఒక్కటి.. నిలకడ. ఆ నిలకడ లేమితనం వల్లే వరుసగా పరాజయాలను చవి చూస్తూ వస్తున్నారు బ్లాక్ క్యాప్స్.