భారత్పై మరోసారి విషం కక్కి.. అడ్డంగా దొరికిపోయిన పాకిస్తాన్
ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్తాన్ మరోసారి విషం కక్కింది. తమ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది భారతేనని ఆరోపించింది.
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్తాన్ మరోసారి విషం కక్కింది. తమ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది భారతేనని ఆరోపించింది. దక్షిణాసియాలో ఉగ్రవాదానికి భారత్ తల్లివంటిదని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగంపై సమాధానమిచ్చే క్రమంలో పాక్ రాయబారి మలీహా లోధీ ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వరాజ్ తన ప్రసంగంలో కీలకమైన కశ్మీర్ అంశాన్ని విస్మరించారన్నారు.
తమ భూభాగంలోని బలూచిస్తాన్ అంశంలో కలుగజేసుకొంటున్నారంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్పైనా ఆరోపణలు చేశారు పాక్ రాయబారి మలీహా లోధీ. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని ఒకవేళ అంతర్జాతీయ సమాజం కోరుకుంటుంటే... తప్పనిసరిగా భారత్ రెచ్చగొట్టే ధోరణి, దూకుడు చర్యలను కట్టడి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
అలాగే వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు ఆపాలని, తమ దేశంలో ఉగ్రవాద సంస్థలకు భారత్ నిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని చెప్పారు. వివాదాన్ని పరిష్కరించుకోవడంలో దాయాది దేశాలు విఫలమైతే... ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత, హక్కు ఉన్నాయని లోధీ వెల్లడించారు.
లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, హఖానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలను తయారు చేసింది పాకిస్తానేనంటూ శనివారం తన ప్రసంగంలో సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సుష్మా పేర్కొన్నట్టు ఉగ్రవాదానికి ఐక్యరాజ్యసమితి నిర్వచనమివ్వాల్సిందేనని లోధీ అన్నారు.
''అయితే ఆ నిర్వచనంలో 'రాజ్య ఉగ్రవాదం'కూడా చేర్చాలి. పాక్కు చెందిన బలూచిస్తాన్లో భారత నిఘా సంస్థల ఆధ్వర్యంలో ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు చేస్తున్నది అదే..'' అని లోధీ ఆరోపించారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పొరుగు దేశాలన్నింటితో భారత్ కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. ఉగ్ర మూకలను తయారు చేయడం, అస్థిరత నెలకొల్పడం ద్వారా పాక్లోని వివిధ ప్రాంతాల్లో శాంతిసామరస్యాలకు విఘాతం కలిగించడమే భారత్ వ్యూహమని ఆమె చెప్పారు.
అడ్డంగా దొరికిపోయిన పాకిస్తాన్..
ఐరాస వేదికగా భారతదేశంపై అసత్య ప్రచారానికి ప్రయత్నించి పాకిస్తాన్ నవ్వులపాలైంది. పాలస్తీనాలోని గాజాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి ఫొటోని చూపిస్తూ.. కశ్మీర్లో పెల్లెట్ గన్స్ బాధితురాలని ఆరోపణలు చేసి అడ్డంగా దొరికిపోయింది. ముఖమంతా గాయాలతో ఉన్న ఆ అమ్మాయి ఫొటో పట్టుకుని 'ఇది భారత ప్రజాస్వామ్య బాహ్య రూపం' అని ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలీహ లోధి ఆదివారం ఆరోపించారు.
అయితే నిజానికి ఆ ఫొటోలోని అమ్మాయి పేరు రవా అబు జోమా. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాయపడిన సమయంలో తీసిన ఫొటో అది. ఆ ఫొటోకు జులై, 2014లో అమెరికా ఫొటో జర్నలిస్టు హైడీ లెవైన్ను అవార్డు కూడా వరించింది. తప్పుజరిగిందని తెలియడంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే లోధి మౌనం వహించడం గమనార్హం.