ట్రంప్ గెలుపు, భారత్కు ఊరట: చైనాకు నష్టమేనా, పాక్లో ఆందోళన!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఆయన ఏం చేస్తారు? ఆయన గెలుపు వల్ల ఎవరికి లాభం? అనే లెక్కలు వేసుకుంటున్నారు. ట్రంప్ గెలుపు భారత దేశానికి లాభమేనని, చైనా, పాకిస్తాన్లకు నష్టమని అంటున్నారు.
ట్రంప్ భారత్కు వ్యతిరేకం కాదని, చైనా, పాకిస్థాన్లకే గట్టి సమస్యలు ఎదురవుతాయని అమెరికా దౌత్యవేత్త విలియం హెచ్ ఏవరీ చెప్పారు. చైనా, పాకిస్థాన్ దశాబ్దాలుగా అమెరికాను మెత్తని గోవును వాడుకున్నట్లుగా ఉపయోగించుకుంటున్నారని ఆయన చెప్పారు.
చైనా.. అమెరికాలో భారీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని, పాకిస్థాన్ ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాటం పేరుతో 2002 నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం పొందుతోందన్నారు. ఇప్పటి వరకు ట్రంప్ చెప్తున్నదాన్నిబట్టి ఆయన ఈ రెండు దేశాలకు వెళ్తున్న నగదు ప్రవాహంలో కోత విధిస్తారంటున్నారు.
అమెరికా పదిహేనేళ్లలో 50 లక్షల మాన్యుఫ్యాక్చరింగ్ జాబ్స్ను కోల్పోగా, చైనా మాన్యుఫ్యాక్చరింగ్ రంగం విపరీతంగా వృద్ధి చెందింది. కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకొస్తానని ట్రంప్ చెప్పారు.
భారత దేశానికి కొంత వరకు నష్టం తప్పకపోవచ్చునని, కానీ చైనాకు జరిగే నష్టం భారత్కు లాభంగా మారే అవకాశాలున్నాయని, ట్రంప్ పాలనలో చైనాకు నష్టం జరగడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు.
భారత్కు ఇబ్బందులు సృష్టిస్తున్న పాక్కు ట్రంప్ పాలనలో భారీ నష్టం తప్పదని చెబుతున్నారు. పాక్ చాలా ప్రమాదకరమైన దేశమని ట్రంప్ అన్నారని విలియం హెచ్ ఏవరీ చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం బరాక్ ఒబామా మాట్లాడుతూ కాశ్మీర్ అంసంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్నారు. ట్రంప్ మాత్రం పాక్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తారంటున్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పాక్ భయపడుతోందట. పాకిస్థాన్లోని ప్రముఖులు, విశ్లేషకులు ఆందోళనకు గురవుతున్నారు. తమ దేశం పట్ల ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తారని అంచనా వేస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష పాలన అనూహ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో జీహాదీలు, ఉగ్రవాదులతో ప్రభుత్వం ఘర్షణ పడుతున్న సమయంలో అసహనం ప్రదర్శిస్తున్న ట్రంప్ విజయం సాధించడం వల్ల పాకిస్థాన్కు ఇబ్బందులు తప్పవంటున్నారు. ట్రంప్కు ఉన్న ఇస్లామోఫోబియా వల్ల ఇబ్బందులు తప్పవని కొందరు భావిస్తున్నారు.