అంతర్జాతీయ వేదికపై ‘కాశ్మీర్’: పాక్ను చీల్చిచెండాడిన భారత్
మాలే: కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తిన పాకిస్థాన్కు చెంపఛల్లుమనేలా సమాధానమిచ్చింది భారత్. ఆదివారం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై మాల్దీవుల్లో జరుగుతున్న దక్షిణాసియా స్పీకర్ల సదస్సులో చర్చ జరిగింది. ఈ సదస్సులో భారత్ తోపాటు పాకిస్థాన్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
తెరపైకి సంబంధం లేని అంశం
కాగా, కీలక అంశంపై ఈ సదస్సులో చర్చ జరుగుతుండగానే పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి ఉద్దేశపూర్వకంగా ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చేయత్నం చేశారు. దీంతో భారత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అతని నోరుమూయించారు. సదస్సుకు సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించడమేంటని మండిపడ్డారు. స్పీకర్ల సదస్సును రాజకీయం చేస్తున్నారా? అంటూ నిలదీశారు.
మీరా నీతులా చెప్పేది..
మా అంతర్గత విషయాలు మీకెందుకని ప్రశ్నించిన హరివంశ్.. మానవ హక్కులపై గగ్గోలు పెట్టే పాకిస్థానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విరుచుకుపడ్డారు. ముందు మీ దేశంలోని వేళ్లూనుకుని ఉన్న ఉగ్రవాదంపై పోరాటం చేయండని హితవు పలికారు. 370 రద్దు మా అంతర్గత విషయమని, దీనిపై ఎవరితోనూ చర్చించాల్సిన అవసరం లేదని హరివంశ్ స్పష్టం చేశారు.
మానవ హక్కుల గురించి మీరా మాట్లాడేది?
అసలు మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత పాకిస్థాన్కు ఉందా? అని ప్రశ్నించారు. గతంలో పాకిస్థాన్ దేశంలో భాగంగా ఉన్న బంగ్లాదేశ్లో పాకిస్థాన్ ఎంతటి నరమేధానికి పాల్పడిందో అందరికీ తెలుసని, లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్ని పాకిస్థాన్.. ఇప్పుడు మానవ హక్కులంటూ నక్క వినయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
కడిగిపారేశారు..
అంతేగాక, భారతదేశంలోని కాశ్మీర్లోని కొంత భాగాన్ని కూడా పాకిస్థాన్ దురాక్రమణ చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)గా ఉన్న మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. 1947లో సైనిక చర్య ద్వారా గిల్గిత్ బాల్టిస్థాన్ను చట్ట విరుద్ధంగా ఆక్రమించుకోలేదా? అంటూ కడిగిపారేశారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, అమెరికా వద్ద కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి అబాసుపాలైన పాక్.. ఇప్పుడు మరో వేదికపై ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చి తన పరువును తానే తీసుకున్నట్లయింది.