పాక్ పై మరో దాడికి భారత్ ప్లాన్ చేసింది: పాక్ మంత్రి సంచలన ఆరోపణ
పుల్వామా దాడుల తర్వాత బాలాకోట్లో భారత్ చేసిన వైమానిక దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. పాక్పై మరోదాడి చేసి ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టేందుకు భారత్ యత్నిస్తోందా..? పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాంటి నివేదిక ఇచ్చాయి.... పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమిటి...?
సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి ఖురేషీ
పుల్వామా దాడుల తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా భారత్ బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ భారత్పై దాడిచేసేందుకు యత్నించినప్పటికీ ఆ దాడులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టారు. ఇక అప్పటి నుంచి భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ సరిహద్దు రేఖ వెంబడి వరుసగా కాల్పులకు పాల్పడుతూనే వస్తోంది. ఆ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి భారత బలగాలు. తాజాగా పాకిస్తాన్ విదేశాంగా మంత్రి మెహ్ముద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై ఈ నెలలోనే భారత్ మరోసారి దాడులు చేసే అవకాశం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ పాక్పై దాడులు చేస్తుంది: ఖురేషీ
ఈ నెలలోనే పాకిస్తాన్పై భారత్ దాడులు చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మెహ్ముద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఇంటెలిజెన్స్ వర్గాల కచ్చితమైన సమాచారం తన దగ్గర ఉందని అన్నారు. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 మధ్యనే ఈ దాడులు జరిగే అవకాశం ఉందని ఆ మేరకు తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పాక్ మంత్రి ఖురేషీ చెప్పారు. తన వద్ద ఉన్న సమాచారంను పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే తనకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు అదే సమయానికి లేదా అదే తేదీల్లో భారత్ దాడి చేస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారనేదానిపై కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు.
ఖురేషీ వ్యాఖ్యలు జిమ్మిక్కు మాత్రమే: రవీష్ కుమార్
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఇది కేవలం పబ్లిక్ జిమ్మిక్కే అని కొట్టిపారేశారు విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్. ఖురేషీ వ్యాఖ్యలు చూస్తూ పాక్లోని ఉగ్రవాదులు భారత్పై దాడి చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్లు ఉందని రవీష్ కుమార్ అన్నారు. మరోవైపు పాకిస్తాన్లోని భారత డిప్యూటీ హైకమిషనర్కు సమన్లు జారీ చేసింది పాక్. భారత్ నుంచి దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది.