విదేశాల నుంచి భారత్కు డబ్బులే డబ్బులు: ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్ : విదేశాల నుంచి ఆయాదేశాలకు డబ్బులు వస్తున్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో నిలిచింది. విదేశాల్లో ఉన్న వారు 2018లో 79 బిలియన్ డాలర్లను పంపినట్లు ప్రపంచబ్యాంకు ఓ నివేదికలో వెల్లడించింది. విదేశాల నుంచి డబ్బులు ఆయాదేశాలకు వస్తున్న దేశాల్లో భారత్ తర్వాత వరుసగా చైనా (67 బిలియన్ డాలర్లు), మెక్సికో ( 36 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (34 బిలియన్ డాలర్లు), ఈజిప్టు (29 బిలియన్ డాలర్లు) దేశాలు నిలిచినట్లు రిపోర్టు వెల్లడించింది.
గత మూడేళ్లలో విదేశాల నుంచి భారత్కు డబ్బులు ఏరులై పారిందని నివేదిక వెల్లడించింది. 2016లో 62.7 బిలియన్ డాలర్లు ఉండగా అది 2017కు 65.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఇక మొత్తానికి విదేశాల నుంచి భారత్కు డబ్బులు పంపిన వారి సంఖ్య 14శాతం పెరిగింది. దీంతో గతేడాది కేరళలో వరదలు వచ్చిన సమయంలో వీరు పంపిన ఈ డబ్బులే చాలామందిని ఆర్థికంగా ఆదుకున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ఇక పాకిస్తాన్కు విదేశాల నుంచి వస్తున్న డబ్బులు పంపుతున్న వారి సంఖ్య ఏడు శాతం మాత్రమే ఉన్నట్లుగా పేర్కొంది ప్రపంచబ్యాంకు. సాధారణంగా సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్కు అధిక మొత్తంలో డబ్బులు పంపడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో 2015లో 15శాతం మంది విదేశాల నుంచి డబ్బులు పంపినట్లు నివేదిక పేర్కొంది. తక్కువ మధ్యఆదాయం కలిగిన దేశాల్లో 2018లో విదేశాలనుంచి వచ్చిన డబ్బుల రికార్డు స్థాయిలో 529 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది.