భారత్లో పేదరిక నిర్మూలన సగానికి తగ్గింది: ప్రపంచబ్యాంక్
వాషింగ్టన్: 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు పేదరికం సగానికి పైగా భారత్ నిర్మూలించగలిగిందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. గత 15 ఏళ్లుగా 7శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో భారత్ కీలకంగా మారుతోందని, ఇందులో భాగంగానే పేదరిక నిర్మూలన జరిగిందని అభిప్రాయపడింది ప్రపంచబ్యాంకు. త్వరలో అంతర్జాతీయ మోనిటరీ ఫండ్తో సమావేశానికి ముందు వరల్డ్ బ్యాంక్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్థిక వృద్ధి పడిపోవడానికి కారణం నీటి కాలుష్యమే కారణం: ప్రపంచబ్యాంకు నివేదిక
గత 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా 7శాతం వార్షిక వృద్ధిని భారత్ నమోదు చేసిందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. మానవాభివృద్ధిలో భారత్ ఎంతో డెవలప్మెంట్ చూపించిందని వెల్లడించింది. అదేసమయంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొందని వ్యాఖ్యానించింది ప్రపంచబ్యాంకు. భారత్లో ఉన్న పెద్ద జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వనరులను పెంచాల్సిన అవశ్యకత ఉందని అభిప్రాయపడింది. పట్టణప్రాంతాల్లో ఉన్న భూమిని సరిగ్గా వినియోగించుకోగలిగితే భారత్ ఎన్నో అద్భుతాలు చేసి చూపగలదని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంకు పెద్ద పీట వేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
నీటి కేటాయింపులు ఆయా రంగాలకు చేయాలని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. అదే సమయంలో దేశంలో 230 మిలియన్ మంది ఇళ్లకు సరైన విద్యుత్ లేదని వెల్లడించింది. ఇక పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెడితే 2030 నాటికి దేశ జీడీపీ 8.8శాతంకు చేరుకుంటుందని ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది. స్థిరమైన వృద్ధి ఉంటేనే ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడించింది. ఏటా ఉద్యోగాల వేటలో 13 మిలియన్ మంది ఉన్నారని అయితే 3 మిలియన్ ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలుగుతున్నారని పేర్కొంది.
ఇక చివరిగా భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని వరల్డ్ బ్యాంక్ అభిప్రాయపడింది. ఇక్కడ సంస్కరణలు వస్తే దేశంలోని మధ్యతరగతి కుటుంబాల ఆంక్షలను నెరవేర్చగలరని పేర్కొంది. ఇలా చేయడం ద్వారా ప్రైవేట్ రంగాలతో ప్రభుత్వ రంగాలు పోటీపడగలవని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.