జనవరి 1న భారత్ సరికొత్త రికార్డు: మనదేశంలో ఎంతమంది చిన్నారులు పుట్టారో తెలుసా..?
ఐక్యరాజ్యసమితి: కొత్త సంవత్సరం రోజున అంటే జనవరి 1, 2020లో భారత్లోనే అత్యధిక మంది పిల్లలు జన్మించారని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) తెలిపింది. బుధవారం రోజున విడుదల చేసిన అధికారిక రిపోర్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
అత్యధిక మంది పిల్లలు పుట్టిన దేశంగా భారత్ రికార్డు
కొత్త ఏడాదిలో అత్యధిక మంది పిల్లలు పుట్టిన దేశాల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. యూనిసెఫ్ రిపోర్టు ప్రకారం 2020 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా 3,92,078 మంది పిల్లలు జన్మించగా... అందులో 67,385 మంది ఒక్క భారత్ దేశంలోనే పుట్టినట్లు యూనిసెఫ్ స్పష్టం చేసింది.
ఆ తర్వాతి స్థానాల్లో 46,299 మంది పిల్లలతో చైనా, 26,039 మందితో నైజీరియా 16,787 మంది పిల్లలతో నాల్గవ స్థానంలో పాకిస్తాన్, 13,020 మందితో ఐదో స్థానంలో ఇండోనేషియా, 10452 మంది పిల్లలతో అమెరికా ఆరోస్థానంలో నిలిచాయి. ఇక 3,92,078 మంది పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా పుట్టగా అందులో 17శాతం మంది భారత్లోనే పుట్టినట్లు గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు పసిఫిక్ ప్రాంతంలోని ఫిజీ దేశంలో 2020వ సంవత్సరంలో తొలి బిడ్డ పుడుతుందని యూనిసెఫ్ అంచనా వేసింది. అమెరికాలో చివరి జననం నమోదు అవుతుందని పేర్కొంది.
కొత్త సంవత్సరం రోజున పిల్లల జననాలపై యూనిసెఫ్ డేటా
ఏటా కొత్త సంవత్సరం జనవరిలో యూనిసెఫ్ పుట్టిన పిల్లలకు సంబంధించిన రికార్డు మెయింటెయిన్ చేస్తుంది. పలువురు ప్రపంచ మేధావులు కూడా జనవరి 1న పుట్టారని చెబుతున్న యూనిసెఫ్ తాజాగా పుట్టిన పిల్లలు వారితో పుట్టిన రోజును పంచుకుంటారని చెప్పింది.
ఇలా జనవరి 1వ తేదీన పుట్టిన మేధావుల్లో ప్రముఖ భౌతికశాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ 1894లో జన్మించగా... ప్రముఖ నటి విద్యాబాలన్ 1979 జనవరి 1న జన్మించారు. ఏది ఏమైనప్పటికీ జనవరి 1న పుట్టడం అనేది జీవితాంతం ఒక గ్రాండ్ వేడుకలా నిలిచిపోతుందని యూనిసెఫ్ తెలిపింది.
పుట్టిన నెలలోపే మృతి చెందిన వారి సంఖ్య ఇలా...
ఇదిలా ఉంటే 2018లో పుట్టిన నెలలోపే 2.5 మిలియన్ మంది శిశువులు మరణించినట్లు యూనిసెఫ్ పేర్కొంది. ఇందులో మూడోవంతు మరణాలు జనవరి 1నే సంభవించాయని తెలిపింది. ఇలా మృతి చెందిన చిన్నారుల్లో ఎక్కువ మంది ముందస్తు జననం, డెలివరీ సందర్భంగా తలెత్తిన కాంప్లికేషన్స్, వివిధ రకాల ఇన్ఫెక్షన్స్తో కన్నుమూశారని యూనిసెఫ్ పేర్కొంది.
మూడు దశాబ్దాలుగా పెరుగుతున్న సంఖ్య
ఇక గత మూడు దశాబ్దాలుగా పుట్టిన పిల్లలు ప్రాణాలతో ఉన్న సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని యూనిసెఫ్ తెలిపింది. ఐదవ ఏటాలోకి అడుగుపెట్టక ముందే మృతి చెందిన వారి సంఖ్య సగానికి పైగా తగ్గిందని చెప్పింది. 2018లో ఐదేళ్లలోపు పుట్టిన పిల్లల సంఖ్యను తీసుకుంటే... నెలలోపే నమోదైన మరణాలు దాదాపు 47శాతంగా ఉన్నాయని వెల్లడించింది యూనిసెఫ్. ఇదే 1990తో పోలిస్తే అప్పుడు 40శాతంగా ఉండేదని వెల్లడించింది.