ట్రాఫిక్కు పరిష్కారం, త్వరలో భారత్లో ఉబర్ ఫ్లయింగ్ క్యాబ్స్: షార్ట్లిస్ట్లో భారత్, నగరాలివే!
Recommended Video
టోక్యో: ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాలతో పాటు ఎన్నో సిటీలలోని ప్రజలు ఎంతోమంది ట్రాఫిక్ జామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులను గట్టెక్కించేందుకు ఉబర్ క్యాబ్ త్వరలో ప్లయింగ్ క్యాబ్స్ (ఎగిరే క్యాబ్స్)ను తీసుకురానుంది.
ఉపర్ ఎయిర్ సిటీలుగా ఈ ఐదు దేశాలు
ఉబర్ ప్రపంచంలోని ఐదు దేశాల్లో ఉబర్ ఫ్లయింగ్ క్యాబ్స్ను తీసుకు రానుంది. ఇందుకోసం పలు దేశాలను పరిశీలించి అందులో నుంచి ఐదు దేశాలను ఉబర్ ఎంపిక చేసింది. ఇందులో భారత్ ఉంది. రానున్న అయిదేళ్లలో ఐదు దేశాల్లో తొలి ఇంటర్నేషనల్ ఉబర్ ఎయిర్ సిటీలుగా చేయనుంది. ఐదు దేశాల్లో జపాన్, భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్ ఉంది.
ముంబై, బెంగళూరు, ఢిల్లీలో ఎంతో రద్దీ
మన దేశంలో మూడు నగరాలపై దృష్టి సారించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, బెంగళూరులను ఎంపిక చేసింది. ఈ మూడు నగరాలు ఎంతో రద్దీగా ఉంటాయని, ఇక్కడి ప్రాంతాల్లో కొన్ని మీటర్లు ప్రయాణించాలన్నా గంటల సమయం తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఉబర్ ఎయిర్ ఆఫీసర్స్ ఈ రద్దీని తగ్గించేందుకు, రవాణా సామర్థ్యం పెంపొందించేందుకు సహకరిస్తుందని తెలిపారు.
ఒక నగరాన్ని ఎంచుకోనుంది
తొలి ప్రయత్నంలో భాగంగా అమెరికాలో వీటిని ప్రారంభిస్తామని తెలిపింది. తాజాగా వీటిని భారత్లోకి కూడా తీసుకురావాలని ఉబర్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఐదేళ్లలో తొలి ఇంటర్నేషనల్ ఉబర్ ఎయిర్ సిటీకి శ్రీకారం చుట్టింది. అమెరికా తర్వాత, ఎంపిక చేసిన ఐదు దేశాల్లో.. ఒక నగరాన్ని ఎంచుకొని ఫ్లయింగ్ క్యాబ్స్ తీసుకురానుంది.
వాటాదారులను ఆహ్వానిస్తోంది
ఫ్లయింగ్ క్యాబ్లకు తొలి నగరాలుగా డల్లాస్, లాస్ఏంజిల్స్ను ఎంచుకున్నట్లు ఉబర్ ఇప్పటికే ప్రకటించింది. ఇక మూడో నగరం విదేశీ నగరం కావాలని భావిస్తున్నట్లు తెలిపింది. భారత్లోని మూడు నగరాల్లో ట్రాఫిక్ బాగా జామ్ అవుతుందని, ఈ సమస్యకు మేం పరిష్కారం చూపుతామని, వీటి ద్వారా ట్రాఫిక్లో కూడా త్వరగా గమ్యాన్ని చేరవచ్చునని చెప్పారు. ఈ ఐదు దేశాల్లో ఉబర్ వాటాదారులను ఆహ్వానిస్తోందన్నారు.