లాడెన్ నుంచి హఫీజ్ సయీద్ వరకు: ఇమ్రాన్ఖాన్కు ఐదు ప్రశ్నలు సంధించిన భారత్
న్యూయార్క్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్పై విషం చిమ్మడం ప్రపంచ దేశాలు చూశాయి. తన ప్రసంగంలో రక్తపాతం, హింసకు పాల్పడటం, తుపాకీలను చేతపట్టడం లాంటి పద వినియోగం చేసి చిక్కుల్లో పడ్డారు. అది ఒక బాధ్యత గల ప్రధాని మాట్లాడాల్సిన మాటలు కావని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ప్రసంగం మొత్తం హింసను ప్రేరేపించేలా ఉందని భారత్ వ్యాఖ్యానించింది.
ఇమ్రాన్ఖాన్ భారత్పై చేసిన ప్రతి వ్యాఖ్యపై స్పందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు ఐక్యరాజ్యసమితిలో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి కార్యదర్శి విదీషా మైత్రా. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ఉగ్రవాదానికి మద్దతుగా ఉన్నట్లు కనిపిస్తోందని విదీషా వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం అంతా విద్వేషాలను రెచ్చగొట్టడం పైనే ఉందని భారత్ వ్యాఖ్యానించింది. కన్నుకు కన్ను, కత్తికి కత్తి అని హింసను ప్రోత్సహిస్తున్నారని భారత్ ధ్వజమెత్తింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపు ఇవ్వాల్సింది పోయి తుపాకీ చేత పట్టుకుంటారన్న వ్యాఖ్యలు చేయడం ఇమ్రాన్ అనుభవరాహిత్యాన్ని బయటపెట్టిందని భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్... ఇమ్రాన్ఖాన్కు పాక్కు కొన్ని ప్రశ్నలు సంధించింది. న్యూయార్క్ పై 9/11 దాడులకు పాల్పడి దాదాపు 3వేల మంది అమాయకుల ప్రాణాలను తీసిన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్కు పాక్ మద్దతుగా నిలిచిందన్న సత్యాన్ని ఒప్పుకోగలరా అంటూ తొలి ప్రశ్న సంధించింది.
* ఐక్యరాజ్యసమితి ఒక వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటే ఆ వ్యక్తికి పెన్షన్ ఇస్తోంది పాకిస్తాన్ కాదా అని ప్రశ్నించింది. హఫీజ్ సయీద్ను ఉద్దేశిస్తూ భారత్ పాకిస్తాన్ను ప్రశ్నించింది. ఆంక్షలు ఉన్న సమయంలో హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ పెన్షన్ ఇచ్చి నడిపిస్తోంది.
* ఉగ్రవాదంకు నిధులు సమకూరుస్తోందన్న ఆరోపణలు రావడంతో న్యూయార్క్లోని హబీబ్ బ్యాంక్ను ఎందుకు మూసివేశారో పాకిస్తాన్ సమాధానం చెప్పగలదా అని మూడో ప్రశ్న సంధించింది భారత్
* ఏ తప్పూ చేయకుంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్తాన్కు ఎందుకు నోటీసులు పంపింది. 20 నుంచి 27 పారామీటర్లను ఉల్లంఘించింది కాబట్టి నోటీసులు పంపింది ఎఫ్ఏటీఎఫ్ అని భారత్ వెల్లడించింది.
* ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్ర వేసిన 130 మందికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చిందన్న నిజాన్ని నిర్థారించగలదా అని ఐదవ ప్రశ్నగా భారత్ సంధించింది.