పాకిస్తాన్ది కపట వైఖరి: ఉగ్రవాదులకు నిలయం, యూఎన్ మీట్లో ఎండగట్టిన భారత్
దాయాది పాకిస్తాన్ కపట వైఖరిని భారత్ ప్రతీ సందర్భంలో ఎండగడుతూ వస్తోంది. ప్రధానంగా అంతర్జాతీయ వేదికపై పాక్ కుట్రలను బహిర్గతం చేస్తోంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిలుస్తోందని భారత్ బల్లగుద్దీ మరీ చెబుతోంది. అలాగే జమ్ముకశ్మీర్ నుంచి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తుందని భారత్ తన వైఖరిని స్పస్టంచేసింది.
కౌంటర్ టెర్రరిజంపై ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో మంగళవారం వర్చువల్ సమావేశం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో మీటింగ్స్ అన్నీ వీడియోల ద్వారా జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి హోంశాఖ సంయుక్త కార్యదర్శి మహావీర్ సింగ్ పాల్గొన్నారు. 2008లో ముంబై దాడులు, 2016లో పఠాన్ కోట్, యురీ, పుల్వామా దాడులు దురదృష్టకరంగా అభివర్ణించారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి సందేశం ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
ద్వేషపూరిత ప్రసంగంతో బెదిరింపులకు గురిచేస్తూ, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని భారత్ ఆరోపించింది. కరోనా మహమ్మరిపై ప్రపంచం పోరాడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం పసలేని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. నిరాధారామైన ఆరోపణలు చేస్తూ.. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అల్ ఖైదాను నిర్మూలించే సమయంలో పాకిస్తాన్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు.
అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడు అని కీర్తించారని గుర్తుచేశారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా ఉందని సింగ్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ వేదికలపై చెబుతూనే వస్తున్నామని తెలిపారు.