పంచశీల సాకుతో రెచ్చిపోతున్న డ్రాగన్: భారత్పై ఇలా ఎదురుదాడి
ప్రస్తుత ఉద్రిక్తతకు భారత సైన్యం చొరబాటే కారణమని ఆక్షేపిస్తున్న డ్రాగన్ మరో ముందడుగు వేసి సరిహద్దుల్లో వివాదంపై తన ప్రజలను భారత్ తప్పుదారి పట్టిస్తోందని ఆరోపణలకు దిగింది.
బీజింగ్: సిక్కిం సరిహద్దుల వెంట నెలకొన్న ప్రతిష్ఠంభనపై తన బెదిరింపుల స్వరాన్ని చైనా మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత ఉద్రిక్తతకు భారత సైన్యం చొరబాటే కారణమని ఆక్షేపిస్తున్న డ్రాగన్ మరో ముందడుగు వేసి సరిహద్దుల్లో వివాదంపై తన ప్రజలను భారత్ తప్పుదారి పట్టిస్తోందని ఆరోపణలకు దిగింది. భారత్ పంచశీల సూత్రాలకు తూట్లు పొడుస్తోందనీ నిందించింది.
' భారత చర్యలు ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయి' అని ఎదురుదాడికి దిగింది.1950లో చైనా, భారత్, మయన్మార్ శాంతియుత సహజీవనం కోసం పంచశీల సూత్రాలను ఆమోదించడం తెలిసిందే. కానీ నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ చైనా పీపుల్స్ ఆర్మీ 1962లో భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన ఘనత అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఇప్పుడు భూటాన్తో సరిహద్దు వివాద పరిష్కారానికి ప్రయత్నిస్తున్నందుకు భారత్.. పంచశీల సూత్రాలకు తూట్లు పొడుస్తున్నదని డ్రాగన్ దాడికి పాల్పడుతున్నది. భూటాన్ అంశంలో సంప్రదింపుల అధికారం భారతదేశానికి ఉన్నదని తెలిసీ మరి.. చైనా బుకాయింపులతో కాలం గడపాలని యోచిస్తున్నది.
సార్వభౌమత్వంపై చైనా ఒంటెద్దు పోకడ
భారతదేశం సాధ్యమైన త్వరగా సేనలను ఉపసంహరించుకొని తన తప్పును తానే సరిదిద్దుకోవాలని చైనా విదేశీవ్యవహారాల అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ హెచ్చరించారు. ప్రస్తుత వివాదానికి, మూడు దేశాల కూడలికి సంబంధమే లేదని బుకాయించడానికి వెనుకాడలేదు. డోక్లామ్ ప్రాంతం ఈ కూడలిలో ఉందని చెప్పటం ప్రజల్ని తప్పుదారి పట్టించటమే అవుతుందంటూ ఇక్కడ రహదారి నిర్మాణ యత్నాన్ని సమర్థించుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకున్న ఏకైక మార్గం, సిక్కిం సెక్టార్లోని ఇరుకైన ప్రాంతానికి (చికెన్ నెక్) సమీపంలో చైనా సైన్యం రహదారిని నిర్మిస్తుందని, ఇది దేశ భద్రతనే ప్రమాదంలో పడవేస్తుందంటూ భారత్ తన ప్రజలను మభ్యపెడుతుంది‘ అని ఆరోపించారు. భారత సైన్యం చర్యలు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మౌలిక సూత్రాలు, నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని విమర్శించారు.
అది చొరబాటేనంటూ..
డోక్లామ్ ప్రాంతంలోకి భారత సైనికుల ప్రవేశాన్ని చైనా భూభాగంలోకి అక్రమ చొరబాటుగానే షువాంగ్ పేర్కొన్నారు. ఇది తీవ్రమైన చర్యగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య తలెత్తే వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఏర్పరచుకున్న ప్రత్యేక యంత్రాంగం లక్ష్యాన్నీ భారత్ ఉల్లంఘించిందని ఆక్షేపించారు. ‘ఇప్పటికైనా ఇరు దేశాల సరిహద్దు ఒప్పందాలకు లోబడి భారత్ తన సైన్యాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. వివాదాన్ని సకాలంలో, తగిన విధంగా ముగించాలని, చైనా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని పేర్కొన్నారు.
పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని హెచ్చరికలు
డోక్లామ్లో ఉద్రిక్తత సడలకపోగా తీవ్రం అవుతున్న నేపథ్యంలో భారత్ తదితర దేశాల్లో పర్యటిస్తున్న తమ పౌరుల భ్రదతకు సంబంధించి అప్రమత్తత హెచ్చరికలు చేసే విషయాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని చైనా విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు. భారత్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలు ప్రస్తుతం ఘర్షణల నేపథ్యంలో తగు జాగ్రత్తలు వహించాలని ఆ దేశానికి చెందిన అధికార వార్తా పత్రికలు ఇప్పటికే హెచ్చరించాయి. భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని గ్లోబల్ టైమ్స్ సూచించింది.
చైనా అధికార మీడియా వ్యాఖ్యలు ఇలా..
భారత్పై తమ మాటల దాడిని చైనా అధికార వార్తా సంస్థలు తీవ్రతరం చేశాయి. వివాదాస్పద డోక్లామ్లో ఉద్రిక్తత తీవ్రమవుతోందని చెబుతూ అక్కడి నుంచి భారత సైనికులు మర్యాదగా వెళ్తారా లేక బలవంతంగా గెంటేయాలా? అంటూ వార్తా పత్రికలు తమ సంపాదకీయంలో పరుష పదజాలంతో రెచ్చిపోయాయి. గ్లోబల్ టైమ్స్ పత్రిక.. ‘‘భారత్కు ఈ సారి గట్టి గుణపాఠం నేర్పాలి'' అని పేర్కొంది. చైనాతో ఘర్షణకు దిగితే భారత్ 1962లో కన్నా మరింత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దిల్లీ సైన్యాన్ని చాలా సులభంగా గెంటేయగల సామర్థ్యం బీజింగ్ సైన్యానికి ఉందని పేర్కొంది. గెంటివేసే పరిస్థితి రాక ముందే డోక్లామ్ నుంచి వెళ్లిపోయి మర్యాదను నెలబెట్టుకోవాలని తెలిపింది. పరిస్థితిని చక్కదిద్దటానికి దౌత్య, సైనికాధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని చైనా ప్రభుత్వానికి సలహానిచ్చింది. చైనా డైలీ అయితే...‘‘భారత్ ఒక సారి అద్దంలో చూసుకోవాలి'' అంటూ పరిహసించింది. ఇటీవల భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ చేసిన ‘రెండున్నర అంచెల యుద్ధానికి సన్నద్ధం', రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ‘1962నాటి భారతదేశం కాదన్న' వ్యాఖ్యలను చైనా వార్తా పత్రికలు ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశాయి.