భారత్ హీరో, పాక్ సమాధి: చైనా మీడియాలో ఆర్టికల్ ఇలా
బీజింగ్: ప్రాంతీయ వెలివేత పేరుతో పాకిస్థాన్ ను భారతదేశం పూర్తిగా సమాధిచేస్తుందని చైనీస్ ప్రభుత్వ మీడియా ఓ ఆశ్చర్యకరమైన కథనాన్ని ప్రచురించింది. గోవాలో బ్రిక్స్ సదస్సుకు ఆయా దేశాల అధినేతలతో పాటు బంగళాఖాత పరివాహక ప్రాంత సరిహద్దు దేశాలన్నింటినీ భారత్ ఆహ్వానించింది.
అయితే దాయాది దేశం పాకిస్థాన్ ను మాత్రం భారత్ వెలివేసింది. ఈ దెబ్బతో పాక్ చిరకాల మిత్రుడు చైనా తన రూటు మార్చుకున్నట్లుంది. పాక్ కు వ్యతిరేకంగా, భారత్ ను నెత్తిన పెట్టుకున్నట్లుగా ఓ ఆశ్చర్యకరమైన కథనాన్ని ప్రచురించింది.
చైనీస్ ప్రభుత్వ పత్రికలోని ఓపీనియన్ కాలమ్ లో చైనా స్కాలర్ రాసిన ఈ కథనంలో బ్రిక్స్ సదస్సు సందర్బంగా భారత్ సాధించిన విజయాలను అభివర్ణించింది. ఈ సదస్సుతో భారత్ గెలిచిందని బీజింగ్ భావిస్తుందని పేర్కొంది.
ఈ బ్రిక్స్ సదస్సుతో పాకిస్థాన్ ను భారత్ సమాధిచేసినట్లు అయ్యిందని వివరించింది. బ్రిక్స్ సదస్సుకు సరిహద్దు దేశాలన్నింటిని ఆహ్వానించిన భారత్ కేవలం ఒక్క పాకిస్థాన్ ను మాత్రం వెలివేయడం గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది.
సెప్టెంబర్ లో సార్క్ సదస్సును బహిష్కరించిన భారత్ తరువాత కొద్ది వారాల్లోనే బ్రిక్స్ సదస్సు జరపడం భారతదేశానికి లభించిన ఓ అరుదైన అవకాశం అని ఆ పత్రిక ప్రచురించింది. ఊరీ ఉగ్రదాడిలో 19 మంది భారత జవాన్లు మరణించారని ఆ పత్రిక గుర్తు చేసింది.
జవాన్లు మరణించడం వలనే భారత్ సార్క్ సమావేశాలను బహిష్కరించిందని, అందుకు వేరే కారణాలు లేవని, కేవలం ఊరీ ఉగ్రదాడి కారణంగా పాక్ ను ఒంటరి చేసిందని చైనీస్ పత్రిక వివరించింది.
భారత్ కు అండగా శ్రీలంక, థాయ్ లాండ్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ నిలవడంతో పాక్ ఏకాకి అయ్యిందని, అన్ని దేశాలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంతో భారత్ చట్టబద్దత పాటించిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
భారత్-పాక్ మధ్య నెలకోన్న ప్రతికూల వాతావరణాలపై బ్రిక్స్ మెంబర్స్ ఎవరూ ఏ దేశం పైనా బహిరంగంగా మొగ్గు చూపలేదని గ్లోబల్ టైమ్స్ స్పష్టం చేసింది. భారత్ తన వైఖరి విషయంలో స్పష్టంగా, సురక్షితంగా ఉందని చెప్పింది.
అదే విధంగా పాకిస్థాన్ తన సదస్సులతో అజెండాలను నిర్మించుకుంటూ లబ్దిపొందుతుందని గ్లోబల్ టైమ్స్ వివరించింది. అయితే సార్క్ సమావేశాలను ప్రత్యామ్నయంగా మరింత సమర్థవంతంగా భారత్ బ్రిక్స్- బ్రిక్స్ టెక్ సదస్సు నిర్వహించిందని అనుకోవడం లేదని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
పాకిస్థాన్ ను వెలివేసిన భారత్ ఉపఖండ దేశాల సమావేశాలు నిర్వహించడం చిన్న దేశాలకు భయాందోళగా భారత్ తన ఆధిపత్య స్థానానికి ఎగబాకుతున్నట్లు అయ్యిందని గ్లోబల్ టైమ్స్ వివరించింది.
భారత్ పరంగా బ్రిక్స్ సదస్సును చూస్తే ప్రస్తుత ప్రపంచ ఆర్థికవ్యవస్థ, ఆర్థిక పాలనలో సంస్కరణలు ప్రతిపాదించడానికి ఇది ఓ అద్బుతమైన వేదిక అయ్యిందని, భారత్ అందులో విజయం సాధించిందని గ్లోబల్ టైమ్స్ ఆర్టికల్ లో అభివర్ణించింది. ఈ కథనం చదివిన పాక్ మాత్రం లోలోపల చైనాను విమర్శిస్తూ భారత్ మీద తన కోపాన్ని మరింత పెంచుకుంది.