భారత్, తానో సుందరాంగిగా భావిస్తోంది: చైనా మీడియా పిచ్చిరాతలు
బీజింగ్: అమెరికాతో లాజిస్టిక్ ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. దీంతో, ఈ డీల్ పైన చైనా అసంతృప్తితో ఉంది. భారత్ - అమెరికా లాజిస్టిక్ ఒప్పందం వల్ల భారత్లోని తమ వ్యాపారాలకు విఘాతం కలుగుతుందని చైనా భావిస్తుంది.
ఈ నేపథ్యంలో చైనా మీడియా సోమవారం నాడు భారత్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్ తానో అత్యంత అందమైన అందగత్తెగా భావిస్తోందని, ప్రతి ఒక్కరూ అలానే అనుకోవాలనుకుంటోందని, ముఖ్యంగా ప్రపంచ సూపర్ పవర్లుగా ఉన్న వాషింగ్టన్, బీజింగ్లతో ఒకేసారి సంబంధాల కోసం వెంపర్లాడుతోందని చైనా ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న 'గ్లోబల్ టైమ్స్' సోమవారం నాటి సంచికలో రాసింది.
భారత్ తీరు ఎలా ఉందంటే... ఎక్కువ మంది పురుషులను ఆకర్షించే అందమైన మహిళలా వ్యవహరిస్తుందని రాసింది. తనంత సుందరాంగి లేదని భావిస్తున్న భారత్, అందరు అలాగే అనుకోవాలని భావిస్తోందని, ముఖ్యంగా ప్రపంచ బలాడ్యులైన అమెరికా, చైనాలను తన వెంట పడేలా చూసుకోవాలని అనుకుంటోందని అభిప్రాయపడింది.
ఇది భారత్కు సరికాదని, కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో భారత దౌత్య విధానం ఎలాంటి మలుపులు తిరిగిందన్న విషయాన్ని తాము ఇప్పటికీ గుర్తుంచుకున్నామని తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికాతో కలిసి సంయుక్త పెట్రోలింగ్ నిర్వహిస్తోందని ఆరోపించింది. అమెరికాతో లాజిస్టిక్ ఒప్పందం కారణంగా భారత్లో తమ వ్యాపార అవకాశాలు దెబ్బతింటాయని చైనా భావిస్తోందని, అదే అక్కసుతో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందంటున్నారు.