కార్గిల్ వార్: పాక్పై వైమానిక దాడులకు సిద్ధపడి, చివరి నిమిషంలో ఆగారా?
న్యూఢిల్లీ: 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో భారత దేశం పాకిస్తాన్ పైన దాడులకు సిద్ధమైందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లోని స్థావరాల్ని బాంబులతో పేల్చి వేసేందుకు యుద్ధ విమానాలను మోహరించినట్లుగా చెబుతున్నారు.
నాడు జూన్ 13వ తేదీన యుద్ధం సమయంలో పాక్ లోపలి భూభాగం పైన పూర్తిస్థాయి వైమానిక దాడులు చేపట్టేందుకు భారత వైమానిక దళ యుద్ధ పైలట్లు సర్వం సిద్ధమయ్యారని, లక్ష్యాలను కూడా అప్పగించారని, రూట్ మ్యాప్లు ఖరారయ్యాయని వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, బార్డర్ దాటి అవతలకు వెళ్లవలసి వస్తే, తప్పించుకునేందుకు వీలుగా పాక్ కరెన్సీని కూడా సేకరించి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆంగ్ల మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
నాడు భారత్, పాక్ విదేశాంగ మంత్రుల చర్చలు విఫలమైన నేపథ్యంలో మన వైమానిక దళం దాడుల ప్రణాళికను సిద్ధం చేసుకుందని తెలుస్తోంది.
సమాచారం మేరకు... తొలుత పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన నాలుగు విమానాలతో దాడులు చేపట్టాలని, రెండంచెల్లో దాడులకు దిగేందుకు పైలట్లకు లక్ష్యాలను అప్పగించారు. ఏర్పాట్లు పూర్తి చేశారు. దాడుల కోసం 16 యుద్ధ విమానాలను మోహరించారు. జూన్ 13న వేకువ జామున నాలుగున్నర గంటలకు యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ అంతలోనే దాడులకు వెళ్లొద్దని ఆదేశాలు వచ్చాయి.