పాక్ ఒక అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో దాడి చేస్తుంది: ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూఏఈ: పుల్వామా దాడుల తర్వాద దాయది దేశం పాకిస్తాన్పై భారత్తో పాటు పలు ప్రపంచదేశాలు కూడా కన్నెర్ర చేశాయి. దాడుల తర్వాత తొలిసారిగా పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భారత్పై ఒక అణుబాంబుతో దాడి చేస్తే దాయాది భారత్ 20 అణుబాంబులతో దాడి చేయగల సత్తా సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని ముషారఫ్ అన్నారు. భారత్ను నిలువరించాలంటే ముందుగా పాకిస్తాన్ 50 అణుబాంబులతో దాడి చేయాలని అలా చేస్తే భారత్ 20 అణుబాంబులతో పాక్ను ఏమీ చేయలేదని చెప్పిన ముషారఫ్ 50 అణుబాంబులతో భారత్పై దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
యూఏఈలో ఓ మీడియాసమావేశంలో మాట్లాడిన ముషారఫ్ కశ్మీర్లో భారత్ ఏమైనా దాడులు చేస్తే... ప్రతీకారంగా పాకిస్తాన్ సింద్ మరియు పంజాబ్ దేశాల్లో దాడి చేసి భారత్కు గుణపాఠం చెప్పాలని అన్నారు. పుల్వామాలో ఉగ్రదాడుల దాడిలో 40 సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉంటే పాకిస్తాన్తో ఇజ్రాయిల్ సంబంధాలను కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముషారఫ్ యూఏఈలో అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి పాకిస్తాన్లో బాగున్న నేపథ్యంలో పాకిస్తాన్కు తిరిగి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్లో రాజకీయ స్థిరత్వం కనిపిస్తోందని ఇమ్రాన్ఖాన్ కేబినెట్లో ఉన్న సగం మంత్రులు తన మనుషులే అని ముషారఫ్ చెప్పారు. న్యాయశాఖ మంత్రి, అటార్నీ జనరల్లు తనకు లాయర్లుగా వ్యవహించారని గుర్తుచేశారు ముషారఫ్. 1999లో నాడు పాక్ అధ్యక్షుడిగా ఉన్న నవాజ్ షరీఫ్ను మిలటరీ చర్య ద్వారా గద్దెదింపి కొద్దిరోజుల పాటు నియంతగా వ్యవహరించారు ముషారఫ్. అనంతరం ఆయన 9ఏళ్ల పాటు పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత మరో సైనిక చర్య ద్వారా ముషారఫ్ను గద్దె దింపి నవాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చారు.