పాక్, చైనా ఓటు కూడా భారత్కే: ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో ఘనవిజయం..సభ్యత్వం: ఏడాది
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలో భారత్ మరోసారి ఘన విజయాన్ని సాధించింది. భద్రతా మండలిలో అశాశ్వత సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్ విజయఢంకా మోగించింది. ఆసియా-పసిఫిక్ కేటగిరీలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో భారత్ ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసింది. ఆసియా-పసిఫిక్ దేశాలన్నీ భారత్కే ఓటు వేశాయి. చివరికి- చైనా, పాకిస్తాన్ కూడా భారత్ వైపే మొగ్గు చూపాయి. అనుకూలంగా ఓటు వేశాయి.
ఫలితంగా 2021-2022 సంవత్సరానికి భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా కొనసాగుతుంది. సభ్యత్వ కాల పరిమితి ముగిసిన తరువాత మరోసారి ఎన్నికలను నిర్వహిస్తారు. అశాశ్వత సభ్య దేశం కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్ ఘన విజయాన్ని సాధించడం ఇది ఎనిమిదో సారి. ఇదివరుకు ఏడుసార్లు వేర్వేరు దఫాలుగా భారత్ ఈ కేటగిరీలో విజయాన్ని సాధించింది.
మనదేశం తరఫున భద్రతా మండలి నాన్ పర్మనెంట్ మెంబర్ విభాగంలో టీఎస్ తిరుమూర్తి ప్రాతినిథ్యాన్ని వహిస్తారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆసియా-పసిఫిక్ కేటగిరిలో అశాశ్వత సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 192 ఓట్లు పోల్ అవగా.. అందులో 184 ఓట్లు భారత్కు పడ్డాయి. మిగిలిన ఎనిమిది ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు అధికారులు. చైనా, పాకిస్తాన్ సహా ఆసియా పసిఫిక్ దేశాలన్నీ భారత్కే ఓటు వేశాయి.
ఆసియా-పసిఫిక్ సహా వేర్వేరు కేటగిరీల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా విజయాన్ని సాధించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆయా దేశాలన్నీ నాన్ పర్మనెంట్ మెంబర్గా విజయం సాధించాయి. కెనడా పోటీ చేసినప్పటికీ..ఓటమి చవి చూసింది. ప్రతి సంవత్సరం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటారు. మొత్తం 10 అశాశ్వత సభ్య దేశాలను ఎంపిక చేయడానికి ఈ ఎన్నికల ప్రక్రియను చేపడుతుంటారు.
సూర్యాపేట్కు కల్నల్ సంతోష్బాబు పార్థివదేహం: కాస్సేపట్లో అంతిమయాత్ర: కోవిడ్ నిబంధనలతో
Recommended Video
మొత్తం 10 స్థానాల్లో అయిదు సీట్లను ఆసియా, ఆఫ్రికా దేశాలకు కేటాయిస్తారు. లాటిన్ అమెరికా, కరేబియన్ ద్వీప దేశాలు, పశ్చిమ యూరప్లకు రెండు చొప్పున, తూర్పు యూరప్కు ఒకటి చొప్పున స్థానాలను కేటాయిస్తారు. ఆయా ఉపఖండాల తరఫున ఎంపికైన దేశాలు భద్రతామండలిలో తమ గళాన్ని వినిపించాల్సి ఉంటుంది. ఆసియా-పసిఫిక్ కేటగిరీలో భారత్ ఘన విజయం సాధించడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. భారత్ విజయాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొంది.