పెట్టుబడుల స్వర్గధామం, ఎన్బీడీ ఆఫీస్ భారత్లో పెట్టండి: ‘బ్రిక్స్’ ప్రధాని నరేంద్ర మోడీ
బ్రెసిలియా: భారతదేశం ప్రపంచంలోనే పెట్టుబడులకు స్నేహపూర్వకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్((బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా)) బిజినెస్ ఫోరం దృష్టికి తీసుకువచ్చారు. గురువారం ఆయన ప్రపంచ పారిశ్రామికవేత్తలు, నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడారు. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన బ్రెసిలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎకనామిక స్లోడౌన్ ఉన్నప్పటికీ ఐదు దేశాలు మాత్రం ఆర్థిక అభివృద్ధి బాటలోనే ఉన్నాయన్నారు. రాజకీ స్థిరత్వంతో ప్రపంచంలోనే భారత్ పెట్టుబడులకు స్నేహపూర్వక ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. 2024లోగా భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు.
కేవలం మౌలిక వసతుల రంగంలోనే 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని ఆయన చెప్పారు. భారతదేశంలో ఉన్న పెట్టుబడులకు గల అవకాశాలను ప్రపంచ దేశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అంతేగాక, భారతదేశంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కార్యాలయాన్ని ప్రారంభించాలని కోరారు. బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
విక్టరీ వేడుకలకు మోడీకి పుతిన్ ఆహ్వానం..
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లను కలిశారు. ఇలా తరచూ కలుసుకుంటుంటే దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
రెండు రోజుల పాటు జరగనున్న 11వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోడీ బుధవారం బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాకు చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సులో మోడీ పాల్గొనడం ఇది ఆరో సారి కానుంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో ప్రస్తుతం బ్రెజిల్ ఉంది. తాజా బ్రిక్స్ సదస్సును 'సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి' అనే థీమ్తో నిర్వహిస్తున్నారు.
బ్రిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోడీ భేటీ అయ్యారు. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడంపై ఇద్దరు చర్చించారు. తరచుగా నిర్వహించే సమావేశాల వల్ల మన సంబంధాలు మరింత పటిష్టమవుతాయని మోడీ అన్నారు. ఈ సందర్భంగా మోడీని పుతిన్ రష్యాకు ఆహ్వానించారు. వచ్చే ఏడాది మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే ఉత్సవాలకు హాజరుకావాలని మోడీని కోరారు. ఇరుదేశాల వాణిజ్యంలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు.
చైనా అధ్యక్షుడితోనూ..
కాగా, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తోనూ నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ 11వ సదస్సు సందర్భంగా మోడీ-జిన్పింగ్లు సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయి. వాణిజ్య పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి అని పీఎంవో తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
మరోసారి మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉందని జిన్పింగ్తో మోడీ వ్యాఖ్యానించారు. మనం తొలిసారి బ్రెజిల్లోనే కలిశామని, మన ప్రయాణం ఇక్కడే మొదలైందని జిన్పింగ్తో మోడీ చెప్పారు. అప్పుడు అపరిచితులుగా మొదలైన మన ప్రయాణం నేడు సన్నిహితుల స్థాయికి చేరిందని మోడీ చెప్పుకొచ్చారు.