గల్ఫ్ బాధితులకు మోక్షం.. ఇండియా రావడానికి లైన్ క్లియర్.. హైదరాబాద్ దౌత్యవేత్త చొరవ
హైదరాబాద్ : గల్ఫ్ చరిత్రలో చాలా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎడారి దేశాల్లో వలస బతుకులతో దుర్భర జీవితం గడుపుతున్న భారతీయులకు సాయమందించే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నడూ చూడని విధంగా సౌది అరేబియాలో భారత రాయబారి చొరవ తీసుకుని.. కార్మికులకు బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేలా చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజా దౌత్యవేత్తగా పేరుగాంచిన ఆ రాయబారి డాక్టర్ ఔసఫ్ సయిద్ హైదరాబాద్కు చెందిన వారు కావడం విశేషం.
సారు.. కారు.. సరే : మరి ఫ్రంట్ కథ కంచికేనా?
కార్మికుల బాధకు చలించిన రాయబారి
పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరైన ఉపాధి దొరకక, కుటుంబాలను పోషించుకోలేక ఎడారి దేశాల బాట పడుతున్నారు. అయితే కొందరు ఏజెంట్ల కారణంగా మోసపోయే పరిస్థితులు దాపురించాయి. ఇక్కడ చెప్పేదొక పని.. అక్కడ చేయించేది మరొక పని. అక్కడి యాజమాన్యాలు ప్రవర్తించే తీరుతో కొన్నిచోట్ల అష్టకష్టాలు పడుతున్నారు మనోళ్లు.
అదలావుంటే గల్ఫ్లో ఎడతెగని కష్టాలు పడుతూ ఇండియాకు తిరిగిరాని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. జీతాలు ఇవ్వక.. తిండి పెట్టక కొన్ని కంపెనీలు నరకయాతనకు గురిచేస్తున్నాయి. అలాంటి వారి దగ్గరకు ఇటీవల సౌదీ అరేబియాలో భారత రాయబారిగా నియమితులైన డాక్టర్ ఔసఫ్ సయిద్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇఫ్తార్ విందుతో మమేకం
గల్ఫ్ దేశాల్లో కొన్ని నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. విదేశీ దౌత్యవేత్తలు, రాయబారులు తమ దేశానికి చెందిన వారు ఉండే ప్రదేశాలకు వెళ్లడంపై కొన్ని రూల్స్ ఉన్నాయి. అందుకే మనోళ్లు కష్టనష్టాలకు గురువుతున్నా.. ఇంతవరకు ఏ రాయబారి కూడా వారున్న చోటకు వెళ్లి కలిసిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల సౌదీ అరేబియాలో భారత రాయబారిగా నియమితులైన హైదరాబాదీ ప్రజా దౌత్యవేత్త డాక్టర్ ఔసఫ్ సయిద్ బాధితులను కలవడం విశేషం.
సౌదీలో జేపీసీ అనే నిర్మాణ సంస్థలో 900 మంది భారతీయులు అష్టకష్టాలు పడుతున్నారు. అందులో తెలుగువాళ్లు సైతం పెద్దసంఖ్యలో ఉన్నారు. కొంతకాలంగా వారికి పని లేకుండా, జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం సతాయిస్తోంది. దాదాపు సంవత్సరం నుంచి సరైన తిండి దొరక్క అర్ధాకలితో అలమటిస్తున్నారు. అయితే విషయం కాస్తా రాయబారి డాక్టర్ ఔసఫ్ సయిద్ దృష్టికి వెళ్లడంతో ఆయన చొరవ తీసుకున్నారు.
300 మంది కార్మికులకు ఎగ్జిట్ వీసాలు.. త్వరలో అందరికి..!
గల్ఫ్ కంట్రీలో భారతీయులు పడుతున్న కష్టాలు చూసి ఆయన చలించిపోయారు. ఎలాగైనా వారిని కలవాలనే ఉద్దేశంతో గురువారం (16.05.2019) నాడు రియాద్లోని క్యాంపునకు వెళ్లారు. ఇఫ్తార్ విందు వంకతో కార్మికులను కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. జేపీసీ యాజమాన్యం తీరుతో నరకయాతన అనుభవిస్తున్న 900 మందిని ఇండియాకు పంపించేలా ఏర్పాట్లు చేశామని తీపి కబురు అందించారు.
కొన్ని కారణాల దృష్ట్యా ప్రస్తుతం 300 మంది కార్మికులకు ఎగ్జిట్ వీసాలు మంజూరయినట్లు వెల్లడించారు. మిగిలిన వాళ్లను కూడా వీలైనంత త్వరలో స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. మొత్తానికి భారత రాయబారి తమ దగ్గరకు రావడం.. స్వదేశానికి పంపిస్తామని హామీ ఇవ్వడం ఆ కార్మికులకు సంతోషం కలిగించింది.