హెచ్1బీ వీసా ఫ్రాడ్, ఇండియన్ అమెరికన్ సీఈవో అరెస్ట్: తేలితే పదేళ్ల శిక్ష
వాషింగ్టన్: హెచ్1బీ వీసా మోసం కేసులో అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. 46 ఏళ్ల కిషోర్ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు.
కిషోర్ పదకొండేళ్ల క్రితం.. అంటే 2007 నుంచి నాలుగు కన్సల్టింగ్ కంపెనీలకు సీఈవోగా పని చేస్తున్నారు. అతడు పలు కంపెనీలలో విదేశీ ఉద్యోగులను నియమించే విషయంలో వీసా మోసాలు, మెయిల్ మోసాలు చేసినట్లు అధికారులు అభియోగాలు నమోదు చేశారు.
నిందితుడు వేర్వేరు ఘటనల్లో వీసా మోసాలకు, పలు ఘటనల్లో ఈ మెయిల్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పలు సందర్భాలలో ఆయన లేబర్ డిపార్టుమెంటుకు, హోంల్యాండు సెక్యూరిటీ విభాగానికి ఫారెన్ ఉద్యోగుల నియామకాలపై బోగస్ వర్క్ ప్రాజెక్టుల వివరాలు పంపారని ఆరోపణలు ఉన్నాయి.
వీసా మోసం కేసులో దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా పడే అవకాశముంది. ఈమెయిల్ మోసంలో ఇరవై ఏళ్ల శిక్ష పడే అవకాశముంది.