కుక్కల గదిలో పనిమనిషి: భారతీయ అమెరికన్ సీఈఓపై కేసు
వాషింగ్టన్: అమెరికాలో ఐటీ స్టాఫింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థను నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్ మహిళా సీఈఓపై అక్కడి అధికారులు అభియోగాలు నమోదు చేశారు. భారతదేశం నుంచి వచ్చి ఆమె వద్ద పని చేస్తున్న పనిమనిషిపై అమానవీయంగా ప్రవర్తించినందుకు సదరు మహిళపై అక్కడి కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది.
కార్మిక శాఖ ఫిర్యాదు ప్రకారం.. రోజ్ ఇంటర్నేషనల్ అండ్ ఐటీ స్టాఫింగ్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న హిమాన్షు భాటియా తన ఇంట్లో భారతదేశం నుంచి తీసుకొచ్చిన షీలా నిగ్వాల్ అనే మహిళను తన ఇంట్లో పని మనిషిగా కుదుర్చుకుంది. ఇందుకు ఆమెకు నెలకు 400 అమెరికన్ డాలర్లతోపాటు వసతి, భోజనం అందజేయడం జరుగుతోంది.
అయితే, ఆమెతో సన్జాన్ క్యాపిస్త్రానో, మియామీ, లాస్వేగాస్, లాంగ్ బీచ్, కాలిఫోర్నియాల్లోని విలాసవంతమైన నివాసాల్లో వారం రోజులపాటు సెలవు ఇవ్వకుండా, రోజుకు 15గంటలపాటు పని చేయిస్తున్నారు భాటియా. అమెరికా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో అక్కడి కార్మిక శాఖ ఆగస్టు 22న భాటియాపై కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫిర్యాదు చేసింది.
నిగ్వాల్ను తీవ్రమైన పని ఒత్తిడికి గురిచేయడంతోపాటు.. ఆమెను భాటియా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక, నిగ్వాల్ అనారోగ్యం పాలైతే ఆమెను కుక్కలుండే గదిలో ఉంచేదని తెలిపింది. భాటియా ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో నిగ్వాల్కు ఆహారం కూడా ఉండేది కాదని చెప్పింది.
నిగ్వాల్ బయటికి వెళ్లకుండా.. ఆమె పాస్ పోర్టును తన వద్దే ఉంచుకుని ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపింది. డిసెంబర్ 2014లో నిగ్వాల్ అమెరికా నిబంధనల గురించి తెలుసుకుంటుండగా పట్టుకుని ఆమెను విధుల నుంచి తొలగించింది భాటియా.
అంతేగాక, తనతో నిబంధనల ప్రకారమే పని చేయించుకున్నట్లు, ఎక్కువగా చేసిన పనికి అదనపు భత్యం కూడా చెల్లించినట్లు బలవంతంగా నిగ్వాల్తో పత్రాలపై సంతకాలు తీసుకుందని భాటియాపై చేసిన ఫిర్యాదులో కార్మిక శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో భాటియాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా, భాటియా సంస్థ 2011లో 357మిలియన్ అమెరికా డాలర్లకుపైగా టర్నోవర్ను సాధించడం గమనార్హం.