కాల్పులు: ఇండియన్ అమెరికన్ దంపతుల మృతి
హూస్టన్: అమెరికాలో తుపాకుల సంస్కృతి అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. తాజాగా ఓ 20ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో భారతీయ అమెరికన్ దంపతులు మృతి చెందారు. కాల్పులకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెస్ట్ వెస్టర్న్ పాయింట్ సౌత్లో పని చేస్తూ అక్కడే నివాసముంటున్న కాంతిభాయి పటేల్(72), ఆయన భార్య హన్సబెన్ పటేల్(67)లను ఆదివారం నిందిత యువకుడు జోషౌ లేనార్డ్ పోచర్ కాల్చి చంపాడు.
ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతి చెందిన దంపతులు పాయింట్ సౌత్ హోటళ్లోనే గత పదేళ్ల నుంచి పని చేస్తున్నారని పోలీసులు చెప్పారు.
ఏ కారణం లేకుండా నిందితుడు వారిపై కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. యువకులు ఇలాంటి ఘటనలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు.
సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. మృతులతో నిందితుడికి ఎలాంటి పరిచయం లేదని తెలిపారు.