న్యూయార్క్ నుంచి భారతీయ అమెరికన్ జెనిఫర్ రాజ్కుమార్ గెలుపు, తొలి ఆసియా మహిళగా రికార్డ్
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. అధ్యక్ష బరిలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరా హోరీగా తలపడుతుంటే.. ఈ రెండు పార్టీల్లోని భారతీయ అమెరికన్లు విజయబావుట ఎగురవేస్తున్నారు. తాజాగా, మరో భారతీయ అమెరికన్ విజయం సాధించారు.
అట్టుడుకుతోన్న అమెరికా: వైట్హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్
తొలి మహిళగా జెనిఫర్..
న్యూయార్క్ నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన 38 ఏళ్ల ఇండో అమెరికన్ న్యాయవాది జెనిఫర్ రాజ్కుమార్.. తన ప్రత్యర్థి గియోవన్నీ పెర్నాపై ఘన విజయం సాధించారు. దీంతో దక్షిణాసియా నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికకానున్న తొలి మహిళగా జెనిఫర్ నిలిచారు. ఆమె స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.
అంచెలంచెలుగా ఎదిగిన జెనిఫర్ రాజ్కుమార్..
వలసదారుల హక్కుల న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందారు జెనిఫర్. జెనిఫర్ రాజ్ కుమార్ న్యాయవాదిగానేగాక న్యూయార్క్లోని సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గానూ పనిచేస్తున్నారు. అంతేగాక, న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ అధికారిగానూ పనిచేశారు. జెనిఫర్ తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లి న్యూయార్క్ సమీపంలోని క్వీన్స్లో స్థిరపడ్డారు. 2015, 2016లలో జెనిఫర్ న్యూయార్క్ రైజింగ్ స్టార్స్ జాబితాలో సూపర్ లాయర్గా అరుదైన గౌరవం పొందారు. కాగా, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆమెను ఇమ్మిగ్రేషణ్ వ్యవహారాల డైరెక్టర్గా, న్యూయార్క్ స్టేట్ ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు.
సత్తా చాటుతున్న భారతీయ అమెరికన్లు.. అభినందనలు
దక్షిణాసియా నుంచి తొలిసారి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవుతున్న మహిళగా నిలిచిన జెనిఫర్ రాజ్కుమార్కు ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్, భారత ప్రవాసులు, భారతీయ అమెరికన్లు అభినందనలు తెలిపారు. తాజాగా న్యూయార్క్ నగరం నుంచి జనరల్ అసెంబ్లీకి ఎన్నికకానున్న జెనిఫర్.. వుడ్హెవెన్, రిజ్వుడ్, రిచ్మాండ్ హిల్, ఓజోన్ పార్క్, గ్లెన్డేల్లతో కూడిన 38వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్కు ప్రాతినిథ్యం వహించనున్నారు. కాగా, మరికొంత మంది భారతీయ అమెరికన్లు కూడా విజయాలను నమోదు చేశారు. డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసిన రాజా కృష్ణమూర్తి మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదోసారి గెలుపుపై అమీ బిరా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా కూడా మూడోసారి గెలుపు నమోదు చేస్తారని తెలుస్తోంది. వాషింగ్టన్ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్ మూడోసారి గెలుపొందారు. ఈ నలుగురు కూడా డెమొక్రాటిక్ అభ్యర్థులే కావడం గమనార్హం.