చంద్రుడిపైకి ఆస్ట్రో రాజా: హైదరాబాద్తో లింక్: తండ్రి ఉస్మానియా పూర్వ విద్యార్థి: నాసా లిస్ట్
వాషింగ్టన్: ఊహించినట్టే.. భారత సంతతికి చెందిన రాజాచారి చందమామపై అడుగు పెట్టబోతోన్నారు. జాబిల్లిపై ప్రయోగాలను సాగించబోతోన్నారు. అమెరికా అంతరిక్ష ప్రయోగాల సంస్థ నాసా ప్రకటించిన తుది జాబితాలో ఆయనకు చోటు దక్కింది. 18 మందితో కూడిన తుది జాబితాను నాసా ప్రకటించింది. ఈ 18 మంది రాజాచారి ఒకరు. సగం మంది వరకు మహిళలతో నిండి ఉన్న ఈ టీమ.. మరో నాలుగేళ్ల తరువాత చంద్రుడిపైకి వెళ్లనున్నారు. అక్కడ ప్రయోగాలను సాగించనున్నారు. నాసా తలపెటిన మానవ సహిత మిషన్ మూన్లో వారంతా భాగం కానున్నారు.
కంప్లీట్ లిస్ట్ ఇదే..
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్లో నిర్వహించిన నేషనల్ స్పేస్ కౌన్సిల్ ప్రతినిధుల భేటీ తరువాత నాసా శాస్త్రవేత్తలు ఈ జాబితాను విడుదల చేశారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. 18 మంది పేర్లను ప్రకటించారు. రాజాచారితో పాటు జోసెఫ్ అకాబా, కాయ్లా బరూన్, మాథ్యూ డొమినిక్, విక్టర్ గ్లోవర్, వారెన్ హోబర్గ్, జానీ కిమ్, క్రిస్టియానా హ్యామ్కాక్ కచ్, కెల్ లిండ్గ్రెన్, నికోల్ ఎ. మన్, అన్నే మెక్క్లెయిన్, జెస్సికా మెయిర్, జాస్మిన్ మొఘ్బెలి, కేట్ రూబిన్స్, ఫ్రాంక్ రూబియో, స్కాట్ టింగిల్, జెస్సికా వాట్కిన్స్, స్టెఫానీ విల్సన్ ఉన్నారు.
హైదరాబాద్ మూలాలు..
రాజాచారి పూర్తి పేరు రాజా జాన్ వుర్పుతూర్ చారి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్. శ్రీనివాసాచారి ఇది వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2017లో వ్యోమగాముల శిక్షణ కోసం నాసా దరఖాస్తులు ఆహ్వానించగా.. రాజాచారి సహా పలువురు ఎంపిక అయ్యారు. రెండేళ్ల పాటు శిక్షణ ఇచ్చారు. షార్ట్ లిస్ట్ను ప్రకటించారు.
అమెరికా ఎయిర్ఫోర్స్ కర్నల్గా
తొలుత రాజాచారి యూఎస్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ సైన్స్'లో డిగ్రీ చేశారు. అనంతరం మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్లో పీజీ చేశారు. అనంతరం కాలిఫోర్నియా ఎయిర్బేస్లోని 461-ఫ్లైట్ టెస్ట్ స్కాడ్రన్లో కమాండర్గా చేరారు. రాజాచారి వివాహితుడు. ఆయన భార్య పేరు హోల్లీ. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో ఇహోవా స్టేట్లో నివాసం ఉంటున్నారు.
Recommended Video
2024 నాటికి మిషన్ మూన్..
మిషన్ మూన్ కోసం ఎంపికైన 18 మంది ఇక నాసా పర్యవేక్షణలో ఉంటారు. మరింత శిక్షణ పొందుతారు. 2024 నాటికి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ను నాసా చంద్రుడి మీదికి ప్రయోగించబోతోంది. ఈ మిషన్లో వారు భాగస్వామ్యులవుతారు. 1972 తరువాత నాసా.. చందమామ మీదికి మానవ సహిత ప్రయోగాలకు సిద్ధపడటం ఇదే తొలిసారి. చంద్రుడిపై మరింత విస్తృత ప్రయోగాలను చేపట్టడానికి ఈ మిషన్ ఉపకరిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక అమెరికాలో చేపట్టిన ఈ తొలి ప్రాజెక్ట్.. తమ అంచనాలకు మించి రాణిస్తుందని ఆశిస్తున్నారు.