షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లు
ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను చైనా వెనకేసుకురావడం తగదని వారు అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సమాఖ్యలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ను వెనకేసుకురావడం.. ఇప్పటికే భారత్ పదేపదే తప్పుబట్టడం జరుగుతోంది. ఈ మధ్యే ఆ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసింది.
"ఉగ్రవాదాన్ని అణిచివేయాలని పాక్ పై చైనా ఒత్తిడి తీసుకురావాలి" అని అన్నారు ఇండియన్ అమెరికన్ కల్చరల్ సెంటర్ ఛైర్మెన్ భరత్ బరాయ్ . ఈ మేరకు షికాగో లోని చైనా కాన్సులేట్లోని కన్సుల్ జనరల్కు మెమొరాండం ఇచ్చారు. షికాగోలో ఇండో అమెరికన్లు ఇలా చైనా కాన్సులేట్ ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం తొలిసారి. నిరసనలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు తెలపడం మానివేయండి అంటే ఫ్లకార్డులు ప్రదర్శించారు. భారత్ మాతా కీ జై అని నినాదంతో ప్రాంతమంతా మార్మోగిపోయింది. అంతేకాదు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందంటూ వెంటనే ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం పాకిస్తాన్ ఇప్పటికైనా మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు షికాగోలోని పాకిస్తాన్ కాన్సులేట్లో మెమొరాండం సమర్పించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని మండిపడ్డ కమ్యూనిటీ సభ్యులు ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా పాక్ తయారైందని మండిపడ్డారు. అంతేకాదు న్యూయార్క్, న్యూ జెర్సీ, కనెక్టికట్లలో నివసించే భారతీయులు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.