విద్వేష నేరాలకు అరికట్టాలంటూ.. వైట్హౌస్ ఎదుట ఇండో అమెరికన్ల ఆందోళన
అమెరికాలో జాత్యహంకార దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ ఎదుట పలువురు ఇండో అమెరికన్లు ఆందోళన చేపట్టారు.
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ ఎదుట పలువురు ఇండో అమెరికన్లు ఆందోళన చేపట్టారు. భారత సంతతికి చెందిన వారు ముఖ్యంగా హిందువులు, సిక్కులు అమెరికాలో విద్వేషపూరిత దాడులకు బలవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వైట్ హౌస్ ఎదుట అవగాహన ర్యాలీ నిర్వహించారు. అమెరికాలో విద్వేషానికి హిందువులు ఎక్కువగా బలవుతున్నారని వర్జీనియాకు చెందిన న్యాయవాది వింద్య అడపా అన్నారు.
తాము ట్రంప్ యంత్రాంగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం లేదని, కేవలం విద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగానే అవగాహన ర్యాలీ చేపట్టామని పేర్కొన్నారు. ఈ విద్వేష నేరాలకు వ్యతిరేకంగా తమకు ట్రంప్ యంత్రాంగం మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు వింద్య చెప్పారు.
ఇంకా, అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నేరాలను తీవ్రంగా ఖండించాలని తాము కోరుతున్నామని, హిందువులు, సిక్కులను మధ్యప్రాచ్య దేశాలకు చెందిన వారిగా పొరబడుతున్నారని ఆమె పేర్కొన్నారు. విద్వేష నేరాలకు పాల్పడే నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ట్రంప్ యంత్రాంగానికి ఒక వినతి పత్రం సమర్పించారు.