ఎవరి మాటలో మనకు అనవసరం, ఇండియన్ ఆర్మీ అన్నింటికి సిద్ధం: పాక్కు రణ్బీర్ సింఘ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత్ ఒక్క సర్జికల్ స్ట్రైక్ చేస్తే తాము పది చేయగలమని పాకిస్తాన్ ఇటీవల హెచ్చరించింది. దీనిపై భారత ఉత్తర కమాండ్ జీవోసి లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ బుధవారం స్పందించారు. ఎవరు ఏం మాట్లాడారో మనకు అవసరం లేదని, కానీ ఇండియన్ ఆర్మీ అన్నింటికి సిద్ధంగా ఉందని చెప్పారు.
ఆర్మీ అన్నింటికీ పూర్తిగా సిద్ధంగా ఉందని మీకు భరోసా ఇస్తున్నానని, ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఏయే సందర్భాల్లో వారు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్నారు. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు.
పాకిస్థాన్ శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడడానికి యత్నిస్తున్నారని, వారి ప్రయత్నాలను భగ్నం చేసేందుకు కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇటీవల పాకిస్థాన్ మిలిటరీ ఇంటర్ సర్వీసెస్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఇటీవల మాట్లాడుతూ పాకిస్థాన్పై భారత్ ఒకసారి సర్జికల్ స్ట్రయిక్ చేస్తే దానికి ఫలితంగా భారత్పై పది చేస్తామని, తమకు హాని తలపెట్టాలని చూస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. దీనిపై రణ్బీర్ సింగ్ ధీటుగా స్పందించారు.