పాకిస్తాన్ జైల్లో భారతీయుడిపై హత్యాయత్నం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి మీద సాటి ఖైదీ దాడి చేశాడు. గాయాలైన భారతీయుడికి కనీసం వైద్యం చేయించలేదని బాధితుడి న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. అయినా జైళ్ల శాఖ అధికారులు పట్టించుకోలేదు.
పెషావర్ సెంట్రల్ జైల్లో హమీద్ నెహల్ అన్సారీ అనే భారతీయుడు మూడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్తాన్ నకిలి ఐడీ కార్డు పెట్టుకోవడంతో పోలీసులు హమీద్ ను అరెస్టు చేసి పెషావర్ సెంట్రల్ జైలుకు పంపించారు.
అదే సెంట్రల్ జైల్లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుడు (ఖైదీ) హమీద్ మీద గురువారం దాడి చేశాడని పాకిస్తాన్ కు చెందిన మీడియా సంస్థ డాన్ శుక్రవారం వెల్లడించింది. హమీద్ మీద గతంలోనూ హత్యాయత్నం జరిగిందని, అతనికి గట్టి భద్రత కల్పించాలని హమీద్ న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు.
ఈ విషయంపై జైలు సూపరిండెంట్ మసూద్ రెహమాన్ స్పందించారు. హమీద్ కు చిన్న చిన్న గాయాలైనాయని, జైల్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని నిర్లక్షంగా సమాధానం ఇచ్చాడు.
గాయాలైన హమీద్ ను ఆసుపత్రికి తరలిస్తామని చెప్పిన జైలు అధికారులు ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతనికి కనీసం వైద్యం చేయించలేదని అతని న్యాయవాది ఆరోపిస్తున్నాడు. హమీద్ కు ప్రత్యేక భద్రత కల్పించాలని జైలు అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని న్యాయవాది ఆరోపించారు.