ఆర్థిక నేరాలు: అట్లాస్ రామంచంద్రన్కు 3ఏళ్ల జైలు
అబుదాబి: అట్లాస్ రామంచంద్రన్గా గుర్తింపు పొందిన భారతీయ వ్యాపారవేత్తకు దుబాయి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన అట్లాస్ గ్రూప్ ఇచ్చిన చెక్ బౌన్స్, తదితర ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుమారు 34 మిలియన్ దినార్ల విలువ చేసే చెక్కుల బౌన్స్ కేసులో అట్లాస్ సైకిల్స్ అధిపతి రామచంద్రన్(74) గత ఆగస్టు నుంచి పోలీసు కస్టడీలో ఉన్నారు.
గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్(జీసీసీ) వందమంది అతి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న రామచంద్రన్ ఇటీవల అప్పులతో పాటు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. బ్యాంకుల రుణాలను చెల్లించడంలో విఫలం కావడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
బంగారు ఆభరణాలు, ఆస్పత్రుల రంగంలోనూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ వ్యాపార దిగ్గజం నటుడు, దర్శకుడు కూడా కావడం విశేషం. 500 మిలియన్ దినార్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన అట్లాస్ జువెల్లరీ, రుణాలను తిరిగి చెల్లించడానికి, జిసిసి దేశాలన్నింటా ఉన్న తమ అన్ని ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది.
దుబాయిలోని యునైటెడ్ నేషనల్ బాంకు ఆవరణలో అతిరహస్యంగా ఏర్పాటు చేయబడిన సమావేశంలో రామచంద్రన్ భార్య ఇందిరా రామచంద్రన్, తమకు రుణాలిచ్చిన 20 బాంకుల వారితో వివిధ రకాల రుణ చెల్లింపు అవకాశాలను గురించి గతంలోనే చర్చించినట్టు సమాచారం.
అయితే తమ సంస్థ ప్రతి ఒక్క రుణాన్ని పూర్తిగా తీర్చడానికే కట్టుబడిందని, ఈ విధమైన ఎత్తుపల్లాలు సాధారణమని, వీటిని అధిగమించే సత్తా తమకు ఉందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.