అమెరికా: అన్యోన్యంగా ఉండే.. భారతీయ యువజంట అనుమానాస్పద మృతి, ఏం జరిగింది?
న్యూయార్క్: భారత్కు చెందిన ఓ యువ జంట అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్ జాతీయ పార్కులో సుమారు 800 అడుగుల అత్యంత ఎత్తైన పర్వతం పైనుంచి వీరు లోయలో పడి మృతి చెందినట్లు స్థానిక వార్తా పత్రిక వెల్లడించింది.
విష్ణు విశ్వనాథ్, మీనాక్షి మూర్తి..
ఈ యువజంటను విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షీ మూర్తి (30)గా గుర్తించారు. విశ్వనాథ్కు ఇటీవలే సిస్కో సంస్థలో సిస్టమ్ ఇంజినీరుగా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలిద్దరూ కొద్దిరోజుల క్రితం న్యూయార్క్ నుంచి శాన్జోస్ నగరానికి నివాసం మార్చారని శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ పత్రిక వెల్లడించింది.
ప్రపంచ యాత్ర చేయాలి..
ఈ యువజంట కలిసి ప్రపంచ యాత్ర కూడా చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. పర్వతంపై భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా దిగిన ఫోటోను విశ్వనాథ్, మీనాక్షి తమ తమ ఫేస్బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు.
ఒకరోజు తర్వాత..
ఘటన జరిగిన ఒక రోజు తర్వాత వీరి మృతదేహాలను పర్యటకులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. ఈ యువజంట కేరళ రాష్ట్రానికి చెందినవారుగా తెలుస్తోంది.
కారణాలు తెలియాలి..
అయితే, ఈ యువ దంపతుల మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారులు, పోలీసులు తెలిపారు.
ప్రమాదమా? ఆత్మహత్యా?
ప్రమాదవశాత్తూ కాలుజారి లోయలో పడ్డారా..? లేదా ఆత్మహత్యా..? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు స్థానిక అధికారులు. కాగా, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ యువజంట మృతి చెందినట్లు తెలియడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.