తొలిసారి: కుల్భూషణ్ జాదవ్ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో ఉన్న కుల్భూషణ్ జాదవ్ను భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లువాలియా కలిశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం కుల్భూషణ్ జాదవ్కు కాన్సులర్ యాక్సెస్ ఇస్తున్నట్లు నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. కుల్భూషణ్ జాదవ్కు కాన్సులర్ యాక్సెస్ ఇస్తామని పాక్ నెలరోజుల క్రితమే చెప్పింది. అయితే కొన్న షరతులు విధించడంతో భారత్ ఇందుకు ఒప్పుకోలేదు. రెండు దేశాల మధ్య విబేధాలు తలెత్తడంతో ఆలస్యమైంది.
ముందుగా అహ్లూవాలియా పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి డాక్టర్ మొహ్మద్ ఫైసల్తో సమావేశమైనట్లు పాక్ పత్రిక డాన్ వెల్లడించింది. ప్రస్తుతం ఓ సబ్జైలులో జాదవ్తో అహ్లూవాలియా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి షరతులు లేకుండానే పాక్ కుల్భూషణ్ జాదవ్కు కాన్సులర్ యాక్సెస్ ఇచ్చిందా అనే అంశంపై స్పష్టత లేదు.
జాదవ్కు కాన్సులర్ యాక్సెస్ ఇస్తున్నట్లు ఆదివారం పాకిస్తాన్ ప్రకటించింది. అయితే సమావేశం సహృద్భావ వాతావరణంలో జరుగుతుందని, అర్థవంతంగా జరుగుతుందని భారత్ ఆశిస్తున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. పాకిస్తాన్ కుల్దీప్కు ఇచ్చిన కాన్సులర్ యాక్సెస్ మరోలా మారకూడదని అంటే డిసెంబర్ 2017లో కుల్భూషణ్ను తన తల్లి భార్య కలిసినప్పుడు తలెత్తిన పరిస్థితులు ఈసారి తలెత్త కూడాదని భారత్ ఆకాంక్షించింది. ఇదిలా ఉంటే జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పాక్ల మధ్య తొలి ద్వైపాక్షిక అంశంపై జరిగిన సందర్భం ఇదే కావడం విశేషం.
2017 ఏప్రిల్లో గూఢచర్యం కింద కుల్భూషణ్ జాదవ్ను పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ మిలటరీ కోర్టు కుల్భూషణ్ జాదవ్కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించింది. అయితే మరణశిక్ష పై పాకిస్తాన్ పునఃపరిశీలించాలని చెబుతూనే అతనికి కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించింది.