అఫ్గాన్లోని భారత ఎంబసీపై ఉగ్రవాదుల దాడి
కాబూల్: ఉత్తర అఫ్గానిస్థాన్లోని మజార్-ఐ-షరీఫ్ నగరంలో భారత దౌత్య కార్యాలయంపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. కొందరు ముష్కరులు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాగా, ఆఫ్ఘాన్ భద్రతా దళాలు ఉగ్రదాడిని తిప్పికొట్టారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, దౌత్య సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు భారత దౌత్య అధికారి బి సర్కార్ వెల్లడించారు. కార్యాలయం పరిసరాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని, తుపాకులు పేలాయని వివరించారు. దాదాపు 20 నిమిషాల పాటు కాల్పులు జరిగినట్లు తెలిపారు. పక్కనున్న మరో భవనం నుంచి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారని, వారెవరూ లోపలకు ప్రవేశించలేదని చెప్పారు.
భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో కాల్పులు కొనసాగుతున్నాయని భారత దౌత్య వేత్త ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎఫ్పీ వెల్లడించింది. మొత్తం ముగ్గురు అధికారులు ఈ దౌత్య కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
భారత్, పాక్ సరిహద్దుల్లోని పఠాన్కోట్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను భారత్ బలగాలు మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిని తామే చేపట్టినట్లు ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.
ఉత్తర అఫ్ఘానిస్థాన్లోని మజార్-ఐ-షరీఫ్ నగరంలో భారత దౌత్య కార్యాలయం వద్ద సోమవారం ఉదయం మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది.ఆదివారం రాత్రి ఉగ్రదాడి జరిగిన విషయం మరువక ముందే ఈ ప్రాంతంలో మరోసారి కాల్పుల శబ్దాలు కలకలం సృష్టించాయి. ఆఫ్ఘాన్ భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నాయి. కాగా, కాల్పులు కొనసాగుతున్నాయని ఆఫ్ఘాన్లో భారత రాయబారి అమర్ సిన్హా తెలిపారు.