అబుదబీలో కేరళ వ్యక్తికి 18 కోట్లు జాక్పాట్, 10 మంది విజేతల్లో 9మంది భారతీయులే
అబుదబీ: యూఏఈలో ఓ భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. అబుదబీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ లక్కీ డ్రాలో అతడు ఏకంగా పది మిలియన్ దిర్హామ్స్ సొంతం చేసుకున్నాడు. భారత్కు చెందిన యొహన్నాన్ సిమన్కు లక్కీ డ్రాలో 10 మిలియన్ దిర్హామ్స్ వచ్చాయి. మన లెక్కల ప్రకారం దాదాపు రూ.18 కోట్లు.
లాటరీలో తనకు ఇంత పెద్ద మొత్తం తగిలిందనే విషయం తెలిసి అతను మొదట అబద్దం అనుకున్నాడు. కానీ ఆ తర్వాత నిజమయ్యేసరికి చాలా సంతోషించాడు. ఇది అద్భుతమని అన్నాడు. మరో విషయం ఏమంటే లక్కీ డ్రాలో గెలుపొందిన మొదటి పదిమంది విజేతల్లో తొమ్మిది మంది భారతీయులే ఉన్నారు. మిగిలిన ఒక్కరు సిరియాకు చెందినవారు.
సిరియాకు చెందిన తైసిర్ నసర్ సాబిహ్కు 70 వేల దిర్హామ్లు వచ్చాయి. ఇది కాకుండా మరో లాటరీలో ఫిలిప్పైన్స్కు చెందిన వ్యక్తికి లాండ్ రోవర్ సిరీస్ 12 కారు లభించింది. ఈ వారం ఆరంభంలో దుబాయ్లోని ఓ డ్రాలో భారతీయ వ్యక్తి సందీప్ మేనన్కు మిలియన్ డాలర్లు, మరో భారతీయుడికి బీఎండబ్ల్యూ కారు వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, ఇప్పుడు డ్రాలో పెద్ద మొత్తం గెలుపొందిన సిమ్మన్ కేరళకు చెందిన వారు. అతనికి తొలుత ఫోన్ చేసి చెప్పినప్పుడు నమ్మలేదు. ఆ తర్వాత అతని టిక్కెట్ నెంబర్తో సహా అన్ని వివరాలు చెప్పిన తర్వాత నమ్మారు.
అతను మాట్లాడుతూ.. 'నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. ఇది నిజం కాదని నేను మొదట భావించా. ఆ తర్వాత నేను నిజంగానే గెలిచానని తెలుసుకున్నాను. ఇది అద్భుతం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. యూఏఈలో నేను 13 ఏళ్ల నుంచి ఉంటున్నాను. దేవుడు ఇన్నేళ్లకు నన్ను కరుణించాడు' అని పేర్కొన్నారు.
సిమన్ జూలై 8వ తేదీన ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ కొన్నాడు. అంతకుముందు కూడా మూడుసార్లు అతను బిగ్ టిక్కెట్ కొనుగోలు చేశాడు. కానీ అప్పుడు లక్ష్మీ వరించలేదు. ఇప్పుడు అతను సొంతగా కొనుగోలు చేశాడు. సిమన్ దుబాయ్లో ఇటీవలే సొంత బిజినెస్ ప్రారంభించాడు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని కేరళలో చారిటీకి ఉపయోగించాలనుకుంటున్నాడు. సిమన్కు ముగ్గురు పిల్లలు.