ట్విస్ట్.. గుహలో ధ్యానంలో చిన్నారులు?: వారిని కాపాడటంలో భారత కంపెనీ సహకారం
Recommended Video
బ్యాంకాక్: థాయ్లాండ్లోని తామ్ లువాంగ్ గుహల్లో చిక్కుకున్న పన్నెండు మంది బాలురు, కోచ్ అంశంలో కొత్త, ఆసక్తికర కోణం వెలుగు చూసింది. పది రోజుల తర్వాత వారు గుహలో ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిని కాపాడేందుకు వెళ్లిన తొలి డైవర్లకు ఆ పన్నెండు మంది బాలురు ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించారని తెలుస్తోంది.
థాయ్లాండ్ కేవ్ ఆపరేషన్: 12 మంది బాలురు, కోచ్ బయటపడ్డారు
తొలిసారి డైవర్లు గుహలోకి ప్రవేశించిన సమయంలో 12 మంది పూర్తి ధ్యానంలో ఉన్నారని చెబుతున్నారు. ధ్యానంతో శక్తిని సంపాదించుకోవాలని కోచ్ ఎకపోల్ (25) బోధించాడట. కోచ్ గతంలో బౌద్ధ సన్యాసి. అతను అనాథగా పెరిగి, సమాజసేవకు దిగాడు. కాగా, వారు సరదాగా వెళ్లారు. గుహలో కోచ్ వారిచే ధ్యానం చేయించి ఉంటారని భావిస్తున్నారు. అన్ని రోజుల పాటు మానసిక ధైర్యంతో ఉండేందుకు ధ్యానం ఉపయోగపడిందని తెలుస్తోంది. విపత్కర పరిస్థితిల్లో వారిని రక్షించింది ఇదే అంటున్నారు. 18 రోజుల పాటు గుహలో ఉన్న పిల్లలు ఎక్కువ సమయం ధ్యానంలో గడిపారు.
ఆపరేషన్ ఇంపాసిబుల్
గుహలో చిక్కుకున్న బాలురను, కోచ్ను ఎలా తీసుకు రావాలో తెలియక అధికారులు తొలుత తలబద్దలు కొట్టుకున్నారు. గుహలో 4 కి.మీ.కు పైగా ఉండటం, దానిని చేరే మార్గాలు నీటితో నిండి ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎగువన ఉన్న పర్వతానికి రంధ్రాలు పెట్టడం, వర్షాకాలం ముగిసే వరకూ కొన్నినెలల పాటు వేచిచూడటం వంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. ఇది చాలా అసాధ్య ఆపరేషన్ అని రెస్క్యూ ఆపరేషన్లోని ఒకరు ఓ దశలో పేర్కొన్నారు. చివరగా గజ ఈతగాళ్లను సొరంగ మార్గాల గుండా పంపి, బాలలను వెలుపలకు తీసుకు రావాలని నిర్ణయించారు.
ఎంతోమందితో ఆపరేషన్
వాతావరణం అనుకూలించింది. గుహ నుంచి నీటి తోడేయడానికి చాలా పంపులు ఏర్పాటు చేశారు. దీంతో సొరంగ మార్గాల్లోకి సుశిక్షిత డైవర్లు ప్రవేశించడానికి కొంతమేర అనుకూలత ఏర్పడింది. వెంటనే సహాయ సిబ్బంది గుహలోకి ప్రవేశించారు. బాలలకు మునుపెన్నడూ నీటిలో డైవింగ్ చేసిన అనుభవం లేకపోవడంతో వారికి మాస్కును వాడటం, ఆక్సిజన్ ట్యాంకు ద్వారా శ్వాస తీసుకోవడంపై శిక్షణ ఇచ్చారు. 50 మంది విదేశీయులు సహా 90 మంది డైవర్లు ఆ ఆపరేషన్లో పాలుపంచుకున్నారు.
ఆపరేషన్ విజయవంతంపై హర్షం
కేవ్ ఆపరేషన్ విజయవంతం కావడంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సహాయ సిబ్బంది ధైర్యసాహసాలను ప్రశంసించారు. వైల్డ్ బోర్స్ ఫుట్బాల్ జట్టు, వారిని రక్షించిన సిబ్బందిని వచ్చే సీజన్లో ఓల్డ్ ట్రాఫర్డ్కు ఆహ్వానిస్తామని బ్రిటన్లోని మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ తెలిపింది. బాలలు క్షేమంగా బైటపడటాన్ని స్వాగతించిన అంతర్జాతీయ ఫుట్బాల్ సంస్థ ఫిఫా.. ఆదివారం మాస్కోలో జరిగే ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్కు వారు హాజరుకాబోరని తెలిపింది. వారు శారీరకంగా బలహీనంగా ఉండటమే కారణమని పేర్కొంది.
వారిని కాపాడటంలో భారత కంపెనీ సహకారం
గుహలో చిక్కుకుపోయిన వారిని కాపాడటంలో భారతీయ కంపెనీ కిర్లోస్కర్ కూడా సహకరించింది. థాయ్లాండ్ గుహలో చిక్కుకుపోయిన 13 మందిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సాంకేతిక సహాయం అందజేసినట్లు మనదేశానికి చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్(కేబీఎల్) ఓ ప్రకటనలో తెలిపింది. గుహలో నీటిమట్టం తగ్గించడానికి అవసరమైన సామగ్రి, సాంకేతికత తమ కంపెనీకి ఉన్నాయని భారతీయ రాయబార కార్యాలయం.. థాయ్లాండ్ అధికారులకు సిఫార్సు చేసిందని వెల్లడించింది.
వాటిని కూడా సిద్ధంగా ఉంచాం
భారత్, థాయ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లోని తమ కార్యాలయాల నుంచి నిపుణులను గుహ వద్దకు పంపినట్లు ఆ కంపెనీ తెలిపింది. జులై 5 నుంచి గుహ వద్దే ఉన్న తమ నిపుణులు, నీటిని తోడటం, పంపుల వినియోగంపై టెక్నాలజీని అందించారని పేర్కొంది. నీటిని తోడటానికి ఉపయోగించే అధిక సామర్థ్యం గల నాలుగు పంపులను సైతం ఎప్పుడు కావాలంటే అప్పుడు థాయ్లాండ్కు విమానాల్లో తరలించడానికి వీలుగా మహారాష్ట్రలోని కిర్లోస్కర్వాడి కర్మాగారం వద్ద సిద్ధంగా ఉంచామని తెలిపింది.