లండన్లో కశ్మీర్ చిచ్చు.. భారత దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి..!
లండన్ : జమ్ముకశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు లండన్లో చిచ్చు రేపుతోంది. ఆ క్రమంలో లండన్ లోని భారత దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులో కూడా ఇలాగే దాడి జరగడాన్ని పలువురు హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు మరోసారి అటాక్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
#WATCH United Kingdom: Pakistani supporters protested outside the Indian High Commission in London yesterday. They also caused damage to the premises. (Video Source: Indian High Commission in London) pic.twitter.com/dFtm7C64XO
— ANI (@ANI) September 4, 2019
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్కు చెందిన కొందరు లండన్ లోని ఇండియన్ హై కమిషన్ను టార్గెట్ చేశారు. ఆ క్రమంలో మంగళవారం నాడు భారత దౌత్య కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ అంశానికి సంబంధించిన విషయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆ దేశానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేయడమే గాకుండా నిరసనకారులు విధ్వంసానికి తెగబడ్డారు. దౌత్య కార్యాలయంపై దాడి చేసి కిటికీలు పగులగొట్టారు. భవనం పైకి రాళ్లు విసురుతూ అద్దాలను ధ్వసం చేశారు. దాంతో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడినట్లు ఇండియన్ హై కమిషన్ ట్వీట్ చేసింది. అంతేకాదు దాడి ఘటనను లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ నిరసనకారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆగస్టు 15వ తేదీన కూడా ఇలాగే భారత దౌత్య కార్యాలయం ఎదుట పలువురు నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో హింస చెలరేగడంతో భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఇండియన్ హై కమిషన్ పై కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులతో ఆందోళనకారులు చెలరేగి పోయారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది.