అమెరికన్లను మోసగించిన కేసులో గేదెల శ్రీనివాస్ కు భారీ జరిమానా!
న్యూయార్క్: అమెరికాకుచెందిన ఔత్సాహిక పరిశోధనా విద్యార్థులు, రచయితలను మోసగించిన కేసులో ప్రవాసాంధ్రునికి భారీ జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం. ఆ ప్రవాసాంధ్రుడి పేరు శ్రీనుబాబు గేదెల అలియాస్ గేదెల శ్రీనివాస్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ! పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చాలాకాలం పాటు కొనసాగిన గేదెల శ్రీనివాస్ కొద్దిరోజుల కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు- జనసేన పార్టీ విశాఖపట్నం లోక్ సభ అభ్యర్థిగా గేదెల శ్రీనివాస్ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. తన పేరును ప్రకటించిన అనంతరం- ఆయన పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్ సీపీలో చేరారు.
ఎవరీ గేదెల శ్రీనివాస్..
విశాఖపట్నం జిల్లాకు చెందిన గేదెల శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. ఉన్నత విద్యావంతుడు. ప్రతిష్ఠాత్మక స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. పీహెచ్ డీ పూర్తి చేసిన ఆయన ఆంధ్రా యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. అమెరికాలోని నెవడాలో `జర్నల్ అఫ్ ప్రొటెయోమిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఓపెన్ యాక్సెస్` అనే రెండు పరిశోధన జర్నల్స్ ను ప్రారంభించారు. దీనితో పాటు- ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా నెలకొల్పారు. ప్రస్తుతం అవి ఆయన నేతృత్వంలోనే కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సేవలను అందించారు. పలు సెమినార్లలో ఆయన పాల్గొన్నారు.ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
ఏమిటీ మోసం
ఆయన ఏర్పాటు చేసిన `జర్నల్ అఫ్ ప్రొటెయోమిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఓపెన్ యాక్సెస్` పరిశోధనాత్మక జర్నల్స్ లో తప్పుడు ప్రకటనలు ప్రచురించి, ఔత్సాహిక పరిశోధకులు, రచయితలను పెద్ద ఎత్తున మోసం చేశారని తేలింది. వేరే పత్రికలు, పుస్తకాల్లో ప్రచురితమైన వ్యాసాలు, కథనాలను తమవిగా చూపించుకుని, వాటి ద్వారా పరిశోధనాత్మక విద్యార్థులు, రచయితల నుంచి భారీగా డాలర్లను వసూళ్లు చేశారని స్పష్టమైంది. దీన్ని గ్రహించిన పరిశోధకులు, రచయితలు నెవడా జిల్లా న్యాయస్థానాన్ని, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న అనంతరం మోసం చోటు చేసుకున్నట్లు ధృవీకరించారు.
50 మిలియన్ డాలర్ల జరిమానా
ఈ రెండు జర్నల్స్ ను అడ్డుగా పెట్టుకుని నెవడా జిల్లా న్యాయస్థానం నిర్ధారించింది. గేదెల శ్రీనివాస్ కు చెందిన ఒమిక్స్ గ్రూప్ ఎల్ఎల్ సీతో , ఐమెడ్ పబ్ ఎల్ఎల్ సీ, కాన్ఫరెన్స్ సిరీస్ ఎల్ఎల్ సీ సంస్థలపై 50 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది అక్కడి న్యాయస్థానం. అమెరికాకు చెందిన వినియోగదారుల ఫోరం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కూడా ఈ మోసాన్ని ధృవీకరించింది. ఈ రెండు జర్నల్స్ పబ్లిషర్లు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారని, తప్పుడు వ్యాసాలను ప్రచురించారని పేర్కొంది. ఔత్సాహిక పరిశోధకులు, రచయితలను మోసగించి, పెద్ద ఎత్తున వసూళ్లు చేశారని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ డైరెక్టర్ ఆండ్రూ స్మిత్ తెలిపారు. దీనికి సంస్థ ఛైర్మన్ గా గేదెల శ్రీనివాస్ బాధ్యత వహించాలని ఆదేశించారు. 50 మిలియన్ డాలర్ల పెనాల్టీని చెల్లించాలని అన్నారు.
ప్రభుత్వ ప్రచురణలు కూడా కాపీ..
`జర్నల్ అఫ్ ప్రొటెయోమిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఓపెన్ యాక్సెస్` జర్నల్స్ లో ప్రచురించిన వ్యాసాల్లో చాలామటుకు కాపీ చేసినవేనని నిర్ధారించింది నెవడా న్యాయస్థానం. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెందిన `పబ్ మెడ్ సెంట్రల్` లో ప్రచురించిన వ్యాసాలను కూడా ఎవరి అనుమతి తీసుకోకుండా.. తమ జర్నల్స్ లో ప్రచురించారని, వాటిని తామే రచించినట్లు ఆథరైజేషన్ కూడా చేశారని దర్యాప్తులో తేలింది. దీనితో గేదెల శ్రీనివాస్ పై భారీ జరిమానా విధించింది అక్కడి న్యాయస్థానం. జరిమానా చెల్లించకపోతే- అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.