భయమా? విద్వేషమా?: భారత జర్నలిస్టును బయటికి పంపిన పాక్ కార్యదర్శి
న్యూయార్క్: పాకిస్థాన్కు మనదేశంపై ఉన్న విద్వేష భావం మరోసారి భయటపడింది. ప్రపంచమంతా చూసే మీడియా సమావేశంలో భారతీయ మీడియా ప్రతినిధి ఉండటాన్ని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి సహించలేకపోయారు.
'ఆ భారతీయ మీడియా ప్రతినిధి బయటికి పంపించేయండి' అని ఆదేశించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల నేపథ్యంలో ఐజాజ్ అహ్మద్ చౌదరి ఓ విలాసవంతమైన హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో మన దేశానికి చెందిన ఓ ఆంగ్ల టీవీ ఛానల్ మీడియా నమ్రత బ్రార్ పాల్గొన్నారు. నమ్రతను చూసిన చౌదరి 'ఇండియన్ కో నికాలో' (ఈ ఇండియన్ను పంపించేయండి) అన్నారు. వెంటనే అక్కడ ఉన్నవారు నమ్రతను బయటికి వెళ్ళిపోవాలని కోరారు. భారతీయ జర్నలిస్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే.. ఐజాజ్ ఈ పని చేసినట్లు అర్థమవుతోంది.
Told "Indian ko nikalo" at #Pakistan press con #UNGA #UriAttacks. Not surprised, we would probably do the same...
— Namrata Brar (@namratabrar) 20 September 2016
కాగా, కనీసం ఒక్క భారతీయుడిని కూడా చూడటానికి పాకిస్థాన్ నేతలు ఇష్టపడకపోవడాన్నిబట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతగా క్షీణిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కూడా యూరీపై ఉగ్రవాద దాడి గురించి భారతీయ మీడియా ప్రతినిధులకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం గమనార్హం.