ఇదేం ప్రేమరా బాబూ.. లండన్లో యువతిని వేధించి జైలుపాలైన భారతీయుడు..
ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని వెంటబడ్డాడు. కాదు పొమ్మనందుకు చూపులతో చంపేశాడు. మాటలతో వేధిస్తూ నిత్యం నరకం చూపించాడు. వేధింపులు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించినా అతను మాత్రం తీరు మార్చుకోలేదు. చివరకు విషయం కోర్టుకు చేరడంతో జడ్జి ఆ ప్రబుద్ధుడికి జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తైన వెంటనే బ్రిటన్ విడిచివెళ్లాలని ఆదేశించారు.
లండన్లో భారత యువకుడికి జైలు
భారత్కు చెందిన రోహిత్ శర్మ లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. 2017లో ఒకరోజు వెంబ్లీ ప్రాంతంలోని షాప్కు వెళ్లిన అతను అక్కడ పనిచేస్తున్న 20ఏళ్ల యువతిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాడు. ఆ విషయాన్ని తనకు చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు యువతి నిరాకరించడంతో రోహిత్ అప్పటి నుంచి ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. తన ప్రేమను అంగీకరించాలంటూ వేధించసాగాడు.
ఉద్యోగం మారిన బాధితురాలు
రోహిత్ వేధింపులు భరించలేక బాధితురాలు ఉద్యోగం మానేసింది. కొత్త జాబ్లో చేరింది. ఆ విషయం తెలుసుకున్న నిందితుడు యువతి ఆఫీసుకు వెళ్లి ఆమెను చూస్తూ వేధించసాగడు. 15 సిమ్ కార్డులను ఉపయోగించి బాధితురాలికి రోజుకు 40కిపైగా ఫోన్ కాల్స్ చేస్తుండటంతో 2018 ఫిబ్రవరిలో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
జైలుకు వెళ్లివచ్చినా ఆగని వేధింపులు
పోలీసుల వార్నింగ్ పట్టించుకోని రోహిత్ శర్మ తీరు మార్చుకోలేదు. యువతిని వెంబడిస్తూ ఆమె పనిచేసే చోటుకు వెళ్లి గంటల తరబడి ఆమెనే చూస్తూ వేధించేవాడు. దీంతో బాధితురాలు 2018 జులైలో మరోసారి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈసారి కేసు నమోదుచేసిన పోలీసులు రోహిత్ను అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై వచ్చిన నిందితుడు మళ్లీ యువతిని వేధించడం మొదలుపెట్టాడు.
దోషిగా తేల్చిన కోర్టు
కేసుకు సంబంధించి 2018 నవంబర్లో కోర్టు విచారణ ప్రారంభమైంది. అయితే దానికి రోహిత్ హాజరుకాకపోవడంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఇంటలిజెన్స్ అధికారుల సాయంతో 2019 ఏప్రిల్లో రోహిత్ను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా ఐల్వర్త్ క్రౌన్ న్యాయస్థానం యువతిని వేధించిన కేసులో దోషిగా తేల్చింది. బాధితురాలిని వెంబడించినందుకు 22 నెలలు, వేధింపులకు పాల్పడినందుకు 6నెలలు, కోర్టు విచారణకు డుమ్మా కొట్టినందుకు నెల చొప్పున మొత్తం 29 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్షాకాలం పూర్తైన తర్వాత అతన్ని భారత్కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.