లవర్ శవంతో కారులో జాలీ రైడ్..
పీకల్లోతుప్రేమ కాస్తా.. పీక కోసేంత కోపంగా మారడానికి చిన్న సంఘటన చాలు. అమ్మనాన్నల్ని కూడా వదిలేసి ఐదేళ్లుగా తనతో ఉంటోన్న అమ్మాయి పట్ల అనుమానం పెంచుకున్న యువకుడు.. చివరికి ఆమెను దారుణంగా చంపేసి.. ఉన్మాదిలా శవంతో కారులో జాలీరైడ్ చేశాడు. దుబాయ్ సిటీలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో మృతురాలు, నిందితుడు భారతీయులే కావడం గమనార్హం. స్థానికంగా సంచలనం రేపిన ఈ కేసులో ఆదివారం తుది తీర్పు వచ్చింది. అల్ ముకాఖబత్ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..
చాలా ఏళ్ల కిందటే దుబాయ్ వెళ్లి స్థిరపడ్డ కుటుంబానికి చెందిన యువకుడికి.. అచ్చం తమలాగే దుబాయ్ లోనే సెటిలైన భారతీయ యువతితో పరిచయం ఏర్పడింది. ఇంట్లోవాళ్లను ఒప్పించి.. వేరు కాపురం పెట్టారు. ఐదేళ్లపాటు సరదాగా గడిపారు. ఎందుకోగానీ కొంతకాలంగా తనను పట్టించుకోవడంలేదంటూ యువకుడు అమ్మాయి ముందు వాపోయాడు. అలాంటిదేమీలేదని ఆమె సర్దిచెబుతూవచ్చింది..
ఒకరోజు ఆఫీసు నుంచి సడెన్ గా ఇంటికొచ్చిన ఆ యువకుడు.. తన ప్రియురాలు వేరొకరితో అసభ్యకర సంభాషణ చేయడాన్ని గుర్తించాడు. వెంటనే ఆమెను మందలించాడు. కొన్నాళ్లు కామ్ గా ఉన్న ఆ యువతి.. మళ్లీ మూడోవాడితో చాటింగ్ మొదలుపెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు.. యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. చీటింగ్ సమస్యకు పరిష్కారం చూపకుంటే విషయం చాలా దూరం వెళుతుందని హెచ్చరించాడు.
ప్రేమికుల మధ్య గొడవలు సర్దుకుపోతాయిలే అని తల్లిదండ్రులు భావించినప్పటికీ, అలా జరగలేదు. గత జూన్ లో ఇద్దరూ కలిసి బయటికి వెళ్లిన సమయంలో ఫోన్ సంభాషణపై మళ్లీ గొడవ జరిగింది. అవసరమైతే విడిపోడానికి సిద్ధంగా ఉన్నానని ఆ యువతి వార్నింగ్ ఇవ్వడంతో ఉన్మాదిలా మారిన యువకుడు.. అప్పటికే వెంటతెచ్చుకున్న కత్తితో పీక కోసిపారేశాడు..
పక్కసీటులో అమ్మాయి శవాన్ని అలాగే ఉంచి, రక్తంతో నిండిన దుస్తులు, కారు తోలుతూ దుబాయ్ సిటీలో చక్కర్లు కొట్టాడా యువకుడు. మధ్యలో ఓ హోటల్ దగ్గర ఆగి, ఫుడ్, వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని మళ్లీ కారెక్కాడు. దాదాపు గంటపాటు శవంతో జాలీ రైడ్ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఒంటినిండా నెత్తురు చూసి అతనే బాధితుడేమోనని పోలీలుసు కన్ఫ్యూజ్ అయ్యారు. చివరికి అతను చేసిన ఘాతుకాన్ని తెల్సుకుని కటకటాల్లోకి నెట్టేశారు. ప్రియురాలిని కిరాతకంగా చంపిన ఆ యువకుడికి కోర్టు మరణశిక్ష విధించింది.