భారత్లో అమెరికా అధ్యక్షుడు: అమెరికాలో భారతీయుడి కాల్చివేత.. !
న్యూయార్క్: అమెరికాలో ప్రవాస భారతీయుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ భారత పర్యటనకు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు ఈ కాల్పులు చోటు చేసుకోవడం యాధృశ్చికం. హంతకుడి కోసం లాస్ ఏంజిలిస్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
హతుడి పేరు మణీందర్ సింగ్ షాహి. పంజాబ్లోని కర్నాల్కు చెందిన వ్యక్తి. ఆరు నెలల కిందటే లాస్ ఏంజిలిస్లో స్థిరపడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వారంతా కర్నాల్లో నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం లాస్ ఏంజిలిస్కు వెళ్లిన మణీందర్ సింగ్ అక్కడి 7-ఎలెవెన్ గ్రోసరీస్ అనే షాపులో పనిచేస్తున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం తెల్లవారు జామున 5:43 నిమిషాల సమయంలో ముఖానికి మాస్క్ వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఒకరు షాపులోకి చొరబడ్డాడు.
తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. షాపులో చోరీ కోసం వచ్చి ఉంటారని విట్టియర్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్తో కాల్పులు జరిపి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో మణీందర్ సింగ్ సంఘటనా స్థలంలోనే మరణించాడని, ఆ సమయంలో షాపులో ఉన్న ఇద్దరు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
సమాచారాన్ని అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. మణీందర్ సింగ్ మృతదేహాన్ని భారత్కు తరలించాడానికి అవసరమైన సొమ్ము తమ వద్ద లేదని అతని సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం గో ఫండ్ పేజీ ద్వారా నిధులను సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రవాస భారతీయ సంఘాలను ఆశ్రయించినట్లు తెలిపారు. వారి సహకారంతో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.