భారత్ లో 50 ఏళ్లుగా ఇంతే! అమెరికా చెప్పిన షాకింగ్ నిజాలు!!
కురిసీ కురవని వాన.. తడిసీ తడవని నేల! నిండుగా వర్షాలు కురవాల్సిన రోజుల్లోనూ సుదీర్ఘంగా పొడి వాతావరణం (డ్రైస్పెల్)! అర్ధ శతాబ్దంగా సాగుతున్న ‘భారతదేశ వర్ష చరిత్ర’ ఇది!
బోస్టన్: కురిసీ కురవని వాన.. తడిసీ తడవని నేల! నిండుగా వర్షాలు కురవాల్సిన రోజుల్లోనూ సుదీర్ఘంగా పొడి వాతావరణం (డ్రైస్పెల్)! అర్ధ శతాబ్దంగా సాగుతున్న 'భారతదేశ వర్ష చరిత్ర' ఇది! అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోంది. 15 ఏళ్లుగా నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి.
అంతకుముందు 50 ఏళ్లతో పోల్చితే 2002 నుంచి మంచి వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో నష్టాలూ తెస్తున్నాయి. అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనంలో ఈ సంగతి తెలిసింది.
ఈ పరిశోధన వివరాలు 'నేచర్ క్లైమేట్ చేంజ్' అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం 2002 నుంచి భారత ఉపఖండమంతా ఉష్ణోగ్రతల్లో 0.1-1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల కనిపించింది. అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల మందగించింది.
''భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతల్లో హఠాత్తుగా, తీవ్ర మార్పు కనిపించింది. హిందూ మహాసముద్ర ఉపరితలంపై మాత్రం అలాంటిది లేదు. భూమిపై అధిక ఉష్ణోగ్రత, చుట్టూ ఉన్న సముద్ర జలాల ఉపరితలంపై తక్కువ వేడి బలమైన రుతు పవనాలకు కలిసి వచ్చే వాతావరణం'' అని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
ఈ పరిణామానికి కారణం తెలుసుకోవడంపై దృష్టి సారించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నైరుతి రుతు పవనాల కాలంలో ఉత్తర, మధ్య భారత దేశంలో 1950ల నుంచి తక్కువ వర్షపాతమే నమోదవుతోంది. ఆఫ్రికా, తూర్పు ఆసియా లోనూ భారతదేశం తరహాలోనే రుతు పవనాలు ఉంటాయి.
అయితే.. ఆఫ్రికా, తూర్పు ఆసియా దేశాలతో పోల్చితే భారత్లో మాత్రం 50 ఏళ్లపాటు వర్షపాతం తక్కువగానే నమోదైంది. 2002 నుంచి ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. తమ అధ్యయనంలో భాగంగా 1950 నుంచి ఇప్పటిదాకా భారత్లో రోజువారీగా నమోదైన వర్షపాత వివరాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు.