సిగరేట్ గొడవ-జాతి విద్వేషం: అమెరికాలో సిక్కు వ్యక్తి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కూతురు మాజీ ప్రియుడు మీర్జా టాట్లిక్(24) అనే వ్యక్తి ఆ దంపతులను శాన్జోసేలోని వారి ఇంట్లో దారుణంగా కాల్చి చంపేశాడు.
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో మొడెస్టో నగరంలోని ఓ కిరాణా దుకాణం బయట శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు భారత్కు చెందిన జగ్జీత్ సింగ్(32)ను పొడిచి చంపారు. దీనిని విద్వేష హత్యగా అనుమానిస్తున్నారు.
అమెరికా జాతీయుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి దుకాణానికి వచ్చి అందులో పనిచేసే జగ్జీత్ను సిగరెట్ పెట్టె ఇవ్వాలని అడగ్గా, సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో అతను జాతిపరమైన దూషణలు చేస్తూ, జగ్జీత్ను హెచ్చరిస్తూ ఆగ్రహంతో వెళ్లిపోయారు.
ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. కొద్దిసేపటికి జగ్జీత్ దుకాణం బయటికెళ్లగా, పదునైన కత్తితో దాడి జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. ఆయన భార్య, పిల్లలు పంజాబ్లోని కపుర్తలాలో ఉంటున్నారు.
మరో ఘటనలో, కేరళకు చెందిన రమేశ్ అనే ఓ యువ వైద్యుణ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మిచిగన్లోని ఓ ప్రధాన రహదారి పక్కన నిలిపిఉన్న కారులో ఆయన దేహాన్ని పోలీసులు గుర్తించారు.
కాగా, అమెరికాలో భారత సంతతి దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారి కూతురు మాజీ ప్రియుడు మీర్జా టాట్లిక్(24) అనే వ్యక్తి ఆ దంపతులను శాన్జోసేలోని వారి ఇంట్లో దారుణంగా కాల్చి చంపేశాడు. అనంతరం పోలీసులతో జరిగిన ఘర్షణలో అతను మరణించాడు.
సిలికాన్వ్యాలీలో పని చేస్తున్న నరేన్ ప్రభు దంపతుల కుమార్తెతో మీర్జా టాట్లిక్ కొన్నాళ్లు ప్రేమాయణం నడిపాడు. గతేడాది వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే మీర్జా టాట్లిక్ ఆమె తలిదండ్రులను పొట్టన బెట్టుకున్నాడు.
ఈ ఘటన జరిగినప్పుడు కూతురు ఇంట్లో లేదు. మీర్జా కాల్పులకు పాల్పడినపుడు తలిదండ్రులతో పాటూ పదమూడేళ్ల తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నట్లు నరేన్ ప్రభు మరో తనయుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వెంటనే రావడంతో 13 ఏళ్ల కుర్రాడిని మీర్జా వదిలేశాడు.