పరాయిదేశంలో పాడు పని: పేరుకు డాక్టరు...మహిళా పేషెంట్లపై వికృత చేష్టలు,అరెస్టు
భారత్లో పుట్టి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ మనదేశం గర్వపడేలా కొందరు చేస్తుంటే... మరికొందరు మాత్రం పరాయి దేశంలో పాడు పనిచేసి దేశానికి అప్రతిష్టను మూటగడుతున్నారు. ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ సమాజానికి ఉపయుక్తంగా ఉండాల్సింది పోయి కామంతో కటకటలాడుతున్నారు. అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటనతో భారత్కు అంతర్జాతీయ సమాజంలో చెడ్డపేరు వచ్చేలా కనిపిస్తోంది.
మనీష్ షా అనే భారత సంతతి డాక్టర్ యూకేలో జనరల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాడు. అయితే తన వద్ద వచ్చే పేషెంట్లకు చికిత్స చేయాల్సిందిపోయి కామంతో కపట పనులకు దిగాడు. ఆయన వద్దకు వచ్చే మహిళా పేషెంట్లను చికిత్స పేరుతో తాకరాని చోట తాకి చేతులు వేయరాని చోట వేసి పైశాచికత్వపు ఆనందాన్ని పొందేవాడు. అయితే ఇలాంటి పాపం ఎప్పుడో ఒకసారి పండుతుంది. డాక్టర్ విషయంలో కూడా పాపం పండింది. ఒక్క ఫిర్యాదుతో డాక్టర్ బతుకు కటకటాలపాలైంది.
డాక్టర్ మనీష్ షా మొత్తం 25 మంది మహిళలను కేన్సర్ పేరుతో చికిత్స అని చెప్పి లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ముందుగా ఓ ఆరుమంది మహిళలపై లైంగిక వేధింపులకు దిగాడు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన మహిళలకు హాలీవుడ్ స్టార్లు అయిన ఏంజిలినా జోలీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఆమెకు జరిగిన ట్రీట్మెంట్ గురించి పెద్ద కథ చెప్పేవాడు. అనంతరం చిన్నగా చేతులు మహిళా పేషెంట్ పై వేసేవాడు. తనను కూడా పరీక్షిస్తానని చెబుతూ చేతులు ఆమె బ్రెస్ట్పై వేసేవాడు. అంతేకాదు వెజైనల్ పరీక్షలు చేయాలంటూ మహిళలపై కామంతో ప్రవర్తించేవాడు. అవసరం లేనప్పటికీ ఇలా మహిళలతో పరీక్షల పేరుతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.
మే 2009 నుంచి జూన్ 2013 మధ్య ఆరుగురు మహిళా పేషెంట్లను లైంగిక వేధింపులకు గురిచేశాడు. పోలీసులు ఈ కామ వైద్యుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఇదే కాకుండా మరో ఐదు నేరాలతో డాక్టర్కు సంబంధం ఉందని కోర్టు అభిప్రాయపడింది. గతంలో కూడా 17 మంది మహిళలను ఇలానే లైంగిక వేధింపులకు గురిచేశాడనే అభియోగం డాక్టర్ మనీష్ షా పై ఉంది.అయితే కేసును విచారణ చేసిన లండన్ కోర్టు తీర్పును వచ్చే ఏడాది ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. మనీష్ షాపై ఫిర్యాదులు రావడంతో 2013లో అతన్ని ప్రాక్టీస్ నుంచి తప్పించారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు.