దారుణ హత్య: భారత సంతతి ఐస్క్రీం వెండర్పై కాల్పులు
లాస్ ఏంజిల్స్: భారత సంతతికి చెందిన జస్వీర్ సింగ్ అనే వ్యక్తిని అమెరికాలో అత్యంత దారుణంగా కాల్చి చంపారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భారత సంతతికి చెందిన జస్వీర్ సింగ్ (45) కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ సిటీలో ఐస్క్రీం వెండర్గా పనిచేస్తున్నాడు.
శనివారం నాడు ఆయన ఐస్క్రీం వ్యాన్లో విధులు నిర్వహిస్తుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశాడు. అనంతరం ఆ దుండగుడు అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను ప్రశ్నించారు.
స్థానికులు చెప్పిన దాని ప్రకారం జస్వీర్ తప్పేమి లేదని, తన పని తాను చేసుకుంటుండగా, ఓ దుండగుడు వచ్చి కాల్చిచంపేశాడని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. నిందితుడిని పట్టుకున్న వారికి 10,000 వేల డాలర్లు ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు.
కాగా, జస్వీర్ సింగ్ గత 17 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడని, ఆయనకు 13ఏళ్ల కుమార్తె ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాదిలో ఓక్లాండ్లో కాల్పుల్లో మొత్తం 74 మంది చనిపోగా, 15 మందికి పైగా ఈ ప్రాంతంలోనే చనిపోవడం గమనార్హం.