యువతి హత్య: ఆసీస్ బ్రిస్బేన్లో భారతీయుడి అరెస్ట్
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు సెంథిల్ కుమార్ అరుముగమ్(31) బ్రిస్బేన్ నగరంలోని గార్డెన్ సిటీ షాపింగ్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం రాత్రి మీనా నారాయణన్(27) అనే యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అరుపులు విన్న హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అరుముగమ్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మీనా అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు మీనా సోదరుడు కూడా మంగళవారం రాత్రి బ్రిస్బేన్ నగరానికి చేరుకున్నాడు.
బ్రిస్బేన్ నగరంలోనే నివాసం ఉంటున్న మీనా.. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసిస్తోంది. కాగా, మృతురాలికి, నిందితునికి వివాహం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వారిద్దరూ సోమవారం రాత్రి మాత్రమే కలిశారని, ఆ తర్వాత మంగళవారం రాత్రి గొడవ కారణంగా ఆమెపై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.